భాజపా నేతల హత్య కేసులో లష్కరే తోయిబా

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో ముగ్గురు భాజపా నేతల హత్య కేసుకు ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాతో సంబంధం ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. పాక్‌ ఆదేశం మేరకే ముష్కరులు..

Published : 30 Oct 2020 19:56 IST

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో ముగ్గురు భాజపా నేతల హత్య కేసుకు ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాతో సంబంధం ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. పాక్‌ ఆదేశం మేరకే ముష్కరులు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేతలను హత్య చేసినట్లు ఐజీ విజయ్‌కుమార్‌ న్యూస్‌ ఏజెన్సీ పీటీఐకి తెలిపారు. ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బీజేవైఎంకు చెందిన ముగ్గురు కార్యకర్తలు ఫిదా హుస్సేన్‌, ఉమెర్‌ హాజమ్‌, ఉమెర్‌ రషీద్‌ బీఘ్‌లను దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా వైకే పోరా ప్రాంతంలో గుర్తుతెలియని ముష్కరులు గురువారం కాల్చి చంపారు. కాగా దాడికి పాల్పడింది తామేనంటూ లష్కరే తొయిబా అనుబంధ సంస్థ రెసిస్టాన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌) వెల్లడించినట్లు అధికారి తెలిపారు.

‘ఓ కారులో వచ్చిన ఉగ్రవాదులు మరో కారులో ఉన్న భాజపా కార్యకర్తలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన బాధితులను ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే వారు మృతిచెందారు’ అని ఐజీ పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్లో పలువురిని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. కశ్మీర్‌లో భాజపా నేతల హత్యను ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖ నేతలు ఖండించారు. వాటి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని