
పక్షులు వచ్చేశాయ్.. నవశకానికి నాంది!
రఫేల్ ఫైటర్ జెట్స్ రాకపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ హర్షం
దిల్లీ: అత్యంత అధునాతన రఫేల్ యుద్ధవిమానాలు భారత వైమానిక అమ్ముల పొదిలో వచ్చి చేరాయి. ఫ్రాన్స్ నుంచి 5 రఫేల్ ఫైటర్ జెట్లు భారత్కు చేరుకోవడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తంచేశారు. రఫేల్ యుద్ధ విమానాలు భారత్కు సురక్షితంగా చేరాయని ట్విటర్లో పేర్కొన్నారు. ఈ జెట్ల రాక భారత సైనిక చరిత్రలో సరికొత్త శకానికి నాందిగా ఆయన అభివర్ణించారు. భారత వైమానిక దళం సామర్థ్యం మరింత పెరిగిందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఈ విమానాలు అందజేసిన ఫ్రాన్స్ ప్రభుత్వానికి రాజ్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. డసాల్ట్ ఏవియేషన్, ఫ్రెంచ్ కంపెనీలు సమయానికి విమానాలు చేరవేశాయని అభినందించారు.
ఈ విమానాలు మంచి పనితీరు కలిగి ఉన్నాయని రాజ్నాథ్ అన్నారు. అలాగే, దానిలోని ఆయుధాలు, రాడార్లు, ఇతర సెన్సార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవన్నారు. ఈ ఫైటర్జెట్ల రాకతో దేశానికి ఎదురయ్యే ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు దేశీయ వైమానిక సామర్థ్యం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. భారత వైమానిక దళం అవసరాలను పూర్తిగా తీర్చేందుకే వీటిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ జెట్ల కొనుగోళ్లపై వచ్చిన నిరాధార ఆరోపణలపై ఇప్పటికే సమాధానం చెప్పినట్టు గుర్తుచేశారు. ఈ మేరకు రఫేల్ ఫైటర్ జెట్లు అంబాలాలో సురక్షితంగా ల్యాండ్ అయిన వీడియోను ట్వీట్ చేశారు.