ప్రపంచ ఆహార కార్యక్రమానికి శాంతి నోబెల్‌

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమానికి(డబ్ల్యూఎఫ్‌పీ) ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చడానికి ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు, సంక్షోభిత ప్రాంతాల్లో

Updated : 09 Oct 2020 15:19 IST

ఓస్లో: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమానికి(డబ్ల్యూఎఫ్‌పీ) ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చడానికి ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు, సంక్షోభిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చేసిన సేవలకుగానూ డబ్ల్యూఎఫ్‌పీని నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపిక చేశారు. సంక్షోభిత ప్రాంతాల్లో ఆకలిని ఆయుధంగా చేసుకోవడాన్ని ఈ కార్యక్రమం అరికడుతోందని నోబెల్‌ కమిటీ కితాబిచ్చింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) ప్రపంచంలోనే అతిపెద్ద మానవీయ సంస్థ. ఆకలి సమస్యను ఎదుర్కోవడం, ఆహార భద్రతపై అవగాహన కల్పించడంలో ఈ సంస్థ విశేష సేవలందిస్తోంది.

యుద్ధం, సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తీవ్రమైన ఆకలి బాధలకు గురవుతున్నారు. ఒక్క 2019లోనే 135 మిలియన్ల మంది ఆకలి సమస్యను ఎదుర్కొన్నారు. ఈ సమస్యను తీర్చడానికి, ఆకలి బాధలను నిర్మూలించేందుకు డబ్ల్యూఎఫ్‌పీ నిరంతరం కృషచేస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది 88 దేశాల్లో దాదాపు 100 మిలియన్ల మంది అన్నార్థుల ఆకలి తీర్చింది డబ్ల్యూఎఫ్‌పీ. 

ప్రస్తుతం ప్రపంచమంతా విలయతాండవం చేస్తోన్న కరోనా మహమ్మారి.. ఈ ఆకలి బాధలను మరింత పెంచింది. యెమెన్‌, కాంగో, నైజీరియా, దక్షిణ సూడాన్‌, బుర్కినాఫాసో లాంటి దేశాల్లో అటు హింసాత్మక ఘర్షణలు, ఇటు కరోనా వల్ల ఆకలి తీవ్ర రూపం దాల్చింది. ఈ దేశాల్లో తిండిలేక ఎంతో మంది విలవిల్లాడిపోతున్నారు. ఇలాంటి వారి కోసం డబ్ల్యూఎఫ్‌పీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది. అంతేగాక, యుద్ధంతో సతమతమవుతున్న ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని