కరోనా చుట్టే సంవాదం!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా చెప్పుకునే అధ్యక్ష అభ్యర్థుల సంవాదం తుది ముఖాముఖి చర్చ ప్రారంభమైంది. ఎన్నికలకు కేవలం రెండు వారాల కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో ఈ చర్చ జరుగుతుండడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ల వైఖరులపై అందరూ దృష్టి సారించారు........

Updated : 23 Oct 2020 11:46 IST

ట్రంప్‌, బైడెన్‌ మధ్య వాడీవేడి చర్చ

అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. చైనా నుంచి వచ్చిన మహమ్మారి విజృంభణకు ముందు రోజుల్లోకి తిరిగి విజయవంతంగా తీసుకెళ్లాలి. దానికి నేను కట్టుబడి ఉన్నాను.  -ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి

నాకు ఓటేశారా.. లేదా..అన్న దానితో నిమిత్తం లేకుండా నేను అమెరికా ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తాను. దేశంలో మెరుగుపరచాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనకు అవకాశాలే. కాల్పనికతపై శాస్త్రీయతకు, భయంపై ఆశలకు అవకాశం కల్పించాలి. ఆ దిశగా మనం ముందుకు సాగాలి. -బైడెన్‌, డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా చెప్పుకునే అధ్యక్ష అభ్యర్థుల సంవాదం తుది ముఖాముఖి చర్చ ప్రారంభమైంది. ఎన్నికలకు కేవలం రెండు వారాల కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో ఈ చర్చ జరుగుతుండడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ల వైఖరులపై అందరూ దృష్టి సారించారు. ట్రంప్‌ కరోనా నుంచి కోలుకున్న తర్వాత జరుగుతున్న చర్చ కావడంతో మహమ్మారి కట్టడిపై ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉండింది. 

కరోనా విజృంభణ..

ట్రంప్‌: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా విజృంభణతోనే అభ్యర్థుల చర్చ ప్రారంభమైంది. తమ ప్రభుత్వం తీసుకున్న చర్చల వల్ల అంచనాల కంటే తక్కువ మంది చనిపోయారు. త్వరలో మహమ్మారి అంతం కాబోతోంది. నేను కరోనా నుంచి కోలుకున్నట్లుగానే అందరూ బయటపడతారు. అందరికీ రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. మహమ్మారి వ్యాప్తికి నేనో లేక బైడెనో కారణం కాదు. చైనాయే అసలు కారణం. కొన్ని వారాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుంది. దీనిపై సమన్వయకర్త వివరణ కోరడంతో ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గారు. వ్యాక్సిన్‌పై తాను చేసిన వ్యాఖ్య హామీ కాదని.. కేవలం అంచనా మాత్రమే అని వివరించారు. వచ్చే వేసవి లేదా శీతాకాలం చివరి వరకు వ్యా్క్సిన్‌ అందరికీ అందుబాటులో ఉండకపోచ్చునని సీడీసీ డైరెక్టర్‌ అంచనా వేశారన్నారు. 

బైడెన్‌: వ్యాక్సిన్‌ పంపిణీకి ట్రంప్‌ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదు. రాబోయే శీతాకాలంలో మరిన్ని చీకటి రోజులు ఎదుర్కోబోతున్నాం. లక్షల మంది మరణాలు కారణమైన వ్యక్తికి మాట్లాడే అర్హతే లేదు. చైనా నుంచి రాకపోకల్ని నిలువరించడంలో ట్రంప్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేదు. కరోనా ప్రమాదకారి అని ట్రంప్ ఇప్పటి వరకూ చెప్పకపోవడం విచారకరం.

హెల్త్‌కేర్‌..

ట్రంప్‌: నా హయాంలో ఒబామా కేర్‌ కంటే మెరుగైన ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చాను. ఇంకా మెరుగైన విధానాన్ని రూపొందిస్తాం. మేం కచ్చితంగా గెలుస్తాం. మా విధానాలు, ప్రాధాన్యతలు ఏంటో మీరే చూస్తారు. 

బైడెన్‌: ఇప్పటికే అనేక వ్యాధులతో బాధపడుతున్న వారిని కూడా సంరక్షణ కల్పిస్తానన్న ట్రంప్‌ హామీకి సవాల్‌ విసురుతున్నా. చాలా రోజుల నుంచి ట్రంప్‌ ఆరోగ్య విధానం గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన విధానాన్ని రూపొందించలేదు.

అవినీతి ఆరోపణలు..

బైడెన్‌: నేను ఇప్పటి వరకు నా జీవితంలో విదేశాల నుంచి ఒక్క డాలర్‌ కూడా తీసుకోలేదు. ట్రంప్ చైనాలో కూడా రహస్యంగా ఓ బ్యాంకు ఖాతాను నిర్వహిస్తున్నారు. 

ట్రంప్‌: బైడెన్‌ ఇప్పటి వరకు రష్యా నుంచి 3.5 మిలియన్ల డాలర్లు తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మరోసారి బైడెన్‌ తనయుడు హంటర్‌ బైడెన్‌ వ్యాపారాలను ప్రస్తావించారు. విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో అనేక అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. 

వలస విధానం...
చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరుచేసే విధానంపై ట్రంప్‌ దాటవేత ధోరణిని అవలంబించారు. అలాంటి వారి కోసం ఒబామా హయాంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలపైకి చర్చను మళ్లించారు. వాటిని పంజరాలుగా అభివర్ణించారు.

బైడెన్‌ మాట్లాడుతూ.. ‘‘తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసి ట్రంప్‌ పెద్ద నేరానికి పాల్పడ్డారు. వారు ఇప్పుడు ఏకాకులుగా మారారు. ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోయడం లేదు’’ 

జాత్యహంకారం..

ట్రంప్‌: నల్లజాతీయుల కోసం అధ్యక్షుడు లింకన్‌ తర్వాత నేను చేసినంతగా ఎవరూ చేయలేదు. ఇక్కడ ఉన్న వారిలో జాత్యహంకారం లేని వారిలో నేను ముందుంటాను. 

బైడెన్‌: అమెరికా చరిత్రంలో అత్యంత జాత్యహంకారం ఉన్న అధ్యక్షుడు ట్రంప్‌. దేశంలో వివక్ష వ్యవస్థీకృతమైంది. దీన్ని రూపుమాపేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. 

 అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన ఏ ఒక్క దేశాన్నీ వదిలిపెట్టేది లేదని జో బైడెన్‌ హెచ్చరించారు. కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. 
 ఒకరి ప్రసంగానికి మరొకరు అడ్డుపడకుండా తాజా చర్చలో మైక్‌ను కట్‌ చేసేలా మ్యూట్‌ బటన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో అభ్యర్థుల మధ్య ఎలాంటి రసాభాస చోటుచేసుకోకపోవడం గమనార్హం. పైగా ఒక్కో అంశంపై స్పందించడానికి ఒక్కొక్కరికీ ఏకధాటిగా రెండు నిమిషాల సమయం కేటాయించారు. 

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థులు బహిరంగంగా ముఖాముఖి చర్చించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల ముందు మూడుసార్లు జరిగే ఈ చర్చలను ‘కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్’(సీపీడీ) నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి సంవాదం సెప్టెంబరు 29న జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకే ట్రంప్‌ కరోనా బారినపడ్డారు. అనంతరం ఆయన కోలుకున్నప్పటికీ.. రెండో చర్చను వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ట్రంప్‌ విముఖత వ్యక్తం చేయడంతో దానిని రద్దు చేశారు. మూడో సంవాదం నేడు జరిగింది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని