కొవిడ్‌ మూలాలు: గబ్బిలాల కోసం అన్వేషణ!

 కరోనా వైరస్‌ మూలాలను కనిపెట్టేందుకు అక్కడి గబ్బిలాల కోసం అవి నివసించే స్థావరాలపై థాయిలాండ్‌ శాస్త్రవేత్తలు గాలింపు చేపట్టారు.

Published : 14 Aug 2020 02:14 IST

రంగంలోకి దిగిన థాయిలాండ్‌ శాస్త్రవేత్తలు

థాయిలాండ్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ఎక్కడినుంచి వచ్చిందనే విషయంపై ఇప్పటికీ సందిగ్థత నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన నిపుణులు బృందం ఇప్పటికే చైనాలో ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసింది. తాజాగా దీనిపై థాయిలాండ్‌లోనూ పరిశోధనలు చేపట్టారు. కరోనా వైరస్‌ మూలాలను కనిపెట్టేందుకు అక్కడి గబ్బిలాల కోసం అవి నివసించే స్థావరాలపై గాలింపు చేపట్టారు. చైనా బయట తొలిసారిగా థాయిలాండ్‌లోనే కరోనా వైరస్‌ బయటపడడంతో ఈ గబ్బిలాలపై జరుపుతున్న పరిశోధనలపై ఆసక్తి నెలకొంది.

ప్రపంచవ్యాప్తంగా 2కోట్ల మందిలో బయటపడ్డ కరోనా వైరస్ మహమ్మారి‌ ఇప్పటికే 7లక్షల 50వేల మందిని బలితీసుకుంది. ఇంతటి మహమ్మారి ముఖ్యంగా గబ్బిలాల నుంచే వ్యక్తులకు సోకిందనే అభిప్రాయం ఆదిలోనే వ్యక్తమైంది. దక్షిణ చైనాలోని యున్నాన్‌లో గబ్బిలాల్లో బయటపడిన వైరస్‌కు కరోనా వైరస్‌ పోలికలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. తాజాగా థాయిలాండ్‌ కూడా గబ్బిలాల్లో పరిశోధన మొదలుపెట్టింది. ఇప్పటికే వీరిదగ్గర దాదాపు 19జాతులకు చెందిన గబ్బిలాలు ఉన్నప్పటికీ, వీటిపై ఇప్పటివరకు కరోనా పరిశోధన పరీక్షలు చేయలేదని సమాచారం. ప్రస్తుతం వైరస్ మూలాలను కనుగొనే ప్రయత్నాలు ముమ్మరం చేసిన థాయిలాండ్‌ శాస్త్రవేత్తలు మరో 200లకు పైగా గబ్బిలాలను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీటికోసం సాయ్‌ యాక్‌ జాతీయ పార్కులో ఉన్న గుహల్లో అన్వేషణ మొదలుపెట్టారు. అక్కడ వీటిని పట్టుకునేందుకు థాయిలాండ్‌ రెడ్‌క్రాస్‌కు చెందిన ఆరోగ్య కేంద్రం నిపుణులు ప్రత్యేక గూళ్లను ఏర్పాటు చేశారు.

గబ్బిలాలు, వాటినుంచి సంక్రమించే వ్యాధులపై గత 20సంవత్సరాలుగా పరిశోధనలు జరుపుతున్న సుపాపార్న్‌ ఈ పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్నారు. ఆ గుహల్లో ఉండే వివిధ జాతుల గబ్బిలాల నుంచి రక్తం, లాలాజలంతోపాటు అవి విడుదల చేసే వ్యర్థాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. తద్వారా వీటిలో ఉండే వ్యాధికారక వైరస్‌ల గురించి మరింత పరిశోధనలను చేసేందుకు వీలుంటుందని సుపాపార్న్‌ స్పష్టం చేశారు. అంతేకాకుండా కొవిడ్‌-19కు కారణమైన వైరస్‌కూడా ఈ గబ్బిలాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు ఆమె అభిప్రాయపడుతున్నారు. ‘ఈ మహమ్మారికి సరిహద్దులు లేవు. ఈ వైరస్‌ గబ్బిలాల నుంచి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రదేశానికైనా ఇవి వెళ్లగలవు’ అని పరిశోధకురాలు సుపాపార్న్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని