‘మహా’ హోంమంత్రిపై..రిటైర్డ్‌ జడ్జితో విచారణ!

మహారాష్ట్ర హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై రిటైర్డ్‌ న్యాయమూర్తితో విచారణ చేపట్టనున్నట్లు హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు.

Updated : 28 Mar 2021 15:59 IST

సిద్ధమైన మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై రిటైర్డ్‌ న్యాయమూర్తితో విచారణ చేపట్టనున్నట్లు హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపాలని హోంమంత్రి దేశ్‌ముఖ్‌ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాసిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ చేసిన ఆరోపణలపై రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నిర్ణయించారు’ అని హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు. నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరానని..దీనిపై ఉద్ధవ్‌ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు.

ఇక ముంబయి నగరంలోని పలు బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.వంద కోట్లు వసూలు చేయాలంటూ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పోలీసు అధికారులకు నిర్ధేశించారని ఆరోపిస్తూ పరమ్‌బీర్‌ సింగ్‌ ముఖ్యమంత్రికి లేఖ రాయడం మహారాష్ట్ర ప్రభుత్వంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో హోంమంత్రి వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ పరమ్‌బీర్‌ తొలుత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, ఈ అంశంపై తొలుత హైకోర్టుకు వెళ్లాలని పరమ్‌బీర్‌కు సూచించింది. సుప్రీం సూచన మేరకు పరమ్‌బీర్‌ బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ సమయంలోనే హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ చేపట్టేందుకు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని