Lakhimpur Kheri: లఖింపుర్‌ ఘటనలో మరో ఛార్జ్‌షీట్‌.. రైతులపైనా అభియోగాలు..!

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో మరో ఛార్జ్‌షీట్ దాఖలైంది. ఇప్పటికే రైతులపైకి వాహనం ఎక్కించినందుకు

Published : 21 Jan 2022 20:47 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో మరో ఛార్జ్‌షీట్ దాఖలైంది. ఇప్పటికే రైతులపైకి వాహనం ఎక్కించినందుకు గానూ కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం తొలి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో భాజపా కార్యకర్తలు, వాహనం డ్రైవర్‌పై జరిగిన దాడికి సంబంధించి ఏడుగురు రైతులపైనా అభియోగాలు మోపుతూ రెండో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ రైతులను పోలీసులు అరెస్టు చేశారు. 

అక్టోబరులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై ఆశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు మృతి చెందారు. రైతులపై వాహనం దూసుకెళ్లడంతో ఆగ్రహం చెందిన రైతులు కారు డ్రైవర్‌, అందులోని వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు భాజపా కార్యకర్తలు, కారు డ్రైవర్‌ మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు జోక్యంతో లఖింపుర్‌ ఖేరీ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఘటనపై దర్యాప్తు జరిపిన సిట్‌ సంచలన విషయాలను వెల్లడించింది. ఇది నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల జరిగింది కాదని, ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రే అని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆశిష్‌ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇటీవల 5000 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.

ఇక రైతులపై దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక భాజపా కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడుగురు రైతులను అరెస్టు చేసి విచారించారు. ఈ రైతులపై అభియోగాలు మోపుతూ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని