ఇంటర్నెట్‌పై ఆధిపత్యాన్ని సహించం! 

ఇంటర్నెట్‌పై ఆధిపత్యాన్ని చెలాయించాలని కొన్ని కంపెనీలు చేసే ప్రయత్నాలను సంహిచబోమని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది.

Published : 19 Mar 2021 01:56 IST

స్పష్టం చేసిన భారత ప్రభుత్వం

దిల్లీ: ఇంటర్నెట్‌పై ఆధిపత్యాన్ని చెలాయించాలని కొన్ని కంపెనీలు చేసే ప్రయత్నాలను సహించబోమని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. సామాజిక మాధ్యమ వేదికలపై ఎవరైనా తమ అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందని, కానీ, వాటిని దుర్వినియోగపరచడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని పేర్కొంది. ట్విటర్‌ అకౌంట్లను నిషేధించడంపై రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, సోషల్‌ మీడియాను ఉపయోగించడం సమస్య కాదని, వాటిని దుర్వినియోగం చేయడమే అసలు సమస్యని పేర్కొన్నారు.

‘మానవుడు సృష్టించిన అత్యంత శక్తివంతమైన సాధనం ఇంటర్నెట్‌. కానీ, ఇది కొందరి చేతుల్లోనే ఉండకూడదు. అందుకే దీనిపై మేము ఒక నిర్ణయంపై కట్టుబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్నెట్‌పై కొన్ని కంపెనీలు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలను అనుమతించం’ అని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టంచేశారు. టూల్‌కిట్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ సభ్యుడు జీసీ చంద్రశేఖర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి, దేశంలో కోట్ల సంఖ్యలో సామాజిక మాధ్యమ యూజర్లు ఉండటం గర్వకారణమని అన్నారు. అంతేకాకుండా వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, లింక్డిన్‌ వంటి సంస్థలు భారత్‌లో తమ కార్యకలాపాలను స్వేచ్ఛగా చేసుకోవచ్చని, సామాన్య భారతీయులను ఈ సంస్థలు ఎంతగానో సాధికారత వైపు నడిపించాయన్నారు.

ఇక సామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్‌పై ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. దేశ సమగ్రతను దెబ్బతీసే అంశాలతో పాటు రక్షణ, మహిళా గౌరవానికి భంగం కలిగే సమాచారాన్ని 36గంటల్లోగా తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల సమయంలో వచ్చే అసత్య వార్తలపై ఎన్నికల సంఘం కూడా ప్రత్యేక విభాగం ద్వారా పర్యవేక్షిస్తోందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని