Bipin Rawat: ‘భారత్‌కు అతిపెద్ద భద్రతా ముప్పుగా చైనా’

భారత్, చైనాల మధ్య సరిహద్దు సంక్షోభం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు చైనా అతిపెద్ద భద్రతా ముప్పుగా మారిందని డిఫెన్స్ స్టాఫ్‌ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. దేశ సరిహద్దులను కాపాడుకునేందుకు గత ఏడాది తరలించిన సైన్యం...

Updated : 12 Nov 2021 20:12 IST

దిల్లీ: భారత్, చైనాల మధ్య సరిహద్దు సంక్షోభం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు చైనా అతిపెద్ద భద్రతా ముప్పుగా మారిందని డిఫెన్స్ స్టాఫ్‌ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. దేశ సరిహద్దులను కాపాడుకునేందుకు గత ఏడాది తరలించిన సైన్యం, ఆయుధ సామగ్రి ఇప్పట్లో తిరిగి రాలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాద పరిష్కారం విషయంలో విశ్వాస లోపం, అనుమానాలే అడ్డుపడుతున్నాయని వెల్లడించారు. ఇదే విషయమై గత నెలలో ఇరు దేశాల మిలిటరీ కమాండర్ల మధ్య జరిగిన 13వ రౌండ్ చర్చలు ఎటూ తేలకుండానే ముగిసిన విషయం తెలిసిందే.

‘ఉగ్రవాదులకు ఊతం లభించే అవకాశం’

గతేడాది గల్వాన్‌ లోయలో ఘర్షణలు మొదలు.. ఇరు దేశాలు సరిహద్దుల వెంబడి మౌలిక సదుపాయాల కల్పన, బలగాల మోహరింపు చేపడుతున్నట్లు జనరల్ రావత్ చెప్పారు. మరోవైపు ఎక్కడైనా.. ఎటువంటి విపత్కర పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అఫ్గాన్‌ విషయమై మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో భద్రతను పటిష్ఠం చేసినప్పటికీ, ఒకవేళ అఫ్గాన్‌లో ఉగ్రశక్తులు మళ్లీ విజృంభిస్తే.. జమ్మూ-కశ్మీర్‌లోని ఉగ్రబృందాలకు ఊతం లభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు చైనాతో.. అటు పాక్‌, తాలిబన్లతో భద్రతాపర సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున.. రెండు వైపులా సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని