Azadi Ka Amrit Mahotsav: మన చదువు నాలుగాకులు ఎక్కువే

ఆంగ్లేయుల రాకతోనే మన దేశంలో బడులు వచ్చాయని... చదువులు బాగుపడ్డాయని, అప్పటిదాకా మనం నిరక్షరాస్యుల్లా... అనాగరికుల్లా ఉండేవారమని అనుకునేవారు ఇప్పటికీ ఉన్నారు! నిజంగా బ్రిటిష్‌ కోడి

Updated : 20 May 2022 05:47 IST

ఆంగ్లేయుల రాకతోనే మన దేశంలో బడులు వచ్చాయని... చదువులు బాగుపడ్డాయని, అప్పటిదాకా మనం నిరక్షరాస్యుల్లా... అనాగరికుల్లా ఉండేవారమని అనుకునేవారు ఇప్పటికీ ఉన్నారు! నిజంగా బ్రిటిష్‌ కోడి కూతతోనే భారత్‌లో విద్యారంగం వికసించిందా... అంటే కాదని ఆంగ్లేయులే ఎలుగెత్తి చాటారు! తమ పాలన ఆరంభమయ్యే సమయానికి... భారత్‌లోని విద్యావిధానాన్ని చూసి తెల్లవారు తెల్లబోయారు. ఐరోపాతో పోలిస్తే భారతీయులు నాలుగాకులు ఎక్కువే చదువుతున్నారని కితాబిచ్చారు!

‘‘బ్రిటిష్‌ పాలనలో భారత్‌లో చదువు దిగజారింది. ఇప్పటికంటే వందేళ్ల కిందటే పరిస్థితి బాగుండేది.’’  1931లో రౌండ్‌టేబుల్‌ సమావేశానికి వెళ్లిన గాంధీజీ లండన్‌లో బ్రిటిష్‌ మేధావుల సమావేశంలో చేసిన వ్యాఖ్య ఇది.  మహాత్ముడికంటే వందేళ్ల ముందే ఆంగ్లేయ అధికారులు మన చదువులకు కితాబిచ్చారు. వ్యాపారం కోసం వచ్చి భారత పాలన పగ్గాలు చేపట్టిన ఈస్టిండియా కంపెనీ తన పాలన సజావుగా సాగటానికి వీలుగా.. భారత్‌ను తొలుత అర్థం చేసుకోవటానికి ప్రయత్నించింది. అందులో భాగంగా తొలినాళ్లలో దేశవ్యాప్తంగా అప్పటి విద్యారంగంపై అధ్యయనం చేయించింది. భారత్‌లో చదువులెలా ఉన్నాయో, ఏం చదువుతున్నారో, ఎలా చదువుతున్నారో తెలుసుకోవాలంటూ తమ బెంగాల్, బొంబాయి, మద్రాసు ప్రావిన్సుల అధికారులను సర్వేకు పురమాయించింది. విలియమ్‌ ఆడమ్స్‌ బెంగాల్, బిహార్‌ ప్రాంతాలపై, థామస్‌ మన్రో మద్రాసు రాష్ట్రంలో పరిస్థితిపై, ఎల్ఫిన్‌స్టోన్‌ బొంబాయిలో ప్రాథమిక విద్యపై నివేదికలు ఇచ్చారు. ఈస్టిండియా కంపెనీ తొలినాళ్ల నాటికి ఇంగ్లాండ్‌లో విద్యావ్యవస్థకు భారత్‌లో చదువులు ఏమాత్రం తీసిపోయేలా లేవని అభిప్రాయపడ్డారు. ఈ నివేదికల ప్రకారం... ‘భారత్‌లో వీధిబడుల వ్యవస్థ అత్యంత కీలకమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కంటే... ప్రజల పోషణలోనే చాలామటుకు ఇవి సాగుతున్నాయి. వీటి వల్ల అందరికీ విద్య అందుబాటులో ఉంటోంది. హిందూ, ముస్లింల గుడులు, మసీదులు విడివిడిగా విద్యాదానంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గురుకులాలు, పాఠశాలలు, మదర్సాలు, కళాశాలలున్నాయి. సంస్కృతం, పారసీ, అరబిక్, స్థానిక భాషలు నేర్పుతున్నారు. ప్రాథమిక విద్యలో చదవటం, రాయటం, కూడికలు, తీసివేతలు తదితర గణిత భావనలతోపాటు విలువలు, వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. పదేళ్ల వయసులోనే వృత్తివిద్యలో శిక్షణ ఇస్తున్నారు. ఉన్నత విద్యలో సంస్కృతం, సాహిత్యం, గణితం, ఖగోళం, లోహశాస్త్రం, వైద్యం, తర్కశాస్త్రం, న్యాయం... చెబుతున్నారు. అన్ని కులాలు, వర్గాల ప్రజలకు చదువు అందుబాటులో ఉంది. మహిళలు మాత్రం తక్కువగా ఉన్నారు.’

మద్రాసు ప్రెసిడెన్సీలో.. ప్రతి 500 మందికి ఒకటి చొప్పున 12,498 బడులున్నాయని 1822లో మన్రో లెక్కించారు. ఉన్నత విద్యకు సంబంధించి ఏ ప్రాంతంలో ఏ కులంవారు ఎంత మంది చదువుతున్నారో కూడా లెక్కలు తీయించారు. ఇందులో ఇంటి వద్ద చదివే వారిని లెక్కించలేదు. ‘‘చాలా ఐరోపా దేశాలతో పోలిస్తే ఇక్కడి చదువులు ఎంతో నాణ్యంగా ఉన్నాయి’’ అని మన్రో కితాబిచ్చారు. బొంబాయి (1823-29)లోనూ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. ‘‘బడి లేని గ్రామం ఒక్కటైనా మా రాష్ట్రంలో లేదు’’ అని బొంబాయి గవర్నర్‌ కౌన్సిల్‌ సభ్యుడు జి.ఎల్‌.పెండర్‌గాస్ట్‌ ప్రకటించారు. బెంగాల్‌లో ఊరికి కనీసం ఒకటి చొప్పున లక్ష బడులు న్నాయని, ప్రతి 400 మందికి ఒక బడి ఉందని... విలియమ్‌ ఆడమ్స్‌ నివేదించారు. ‘‘ఐరోపాతో పోలిస్తే... బాగా చదివి, రాయగలిగి, లెక్కలు చేసే వారి సంఖ్య భారత్‌లోనే అధికం’’ అని బొంబాయి సొసైటీ విద్యా నివేదిక వ్యాఖ్యానించింది. ‘‘భారత్‌లో పిల్లలకు చదువు ఐరోపాలోలా ఖర్చుతో కూడుకున్నది కాదు. చెట్ల కిందే కూర్చొని తమ ముందున్న ఇసుకలో రాస్తూ నేర్చుకుంటారు. ప్రాథమిక విద్యలో విలువలపై, వ్యక్తిత్వ నిర్మాణంపై దృష్టి సారిస్తారు’’ అని ఈస్టిండియా కంపెనీ తరఫున పనిచేయటానికి వచ్చి వెళ్లిన ఫాదర్‌ పాలినోడా బార్టలోమియో మెచ్చుకున్నాడు.

అలా సాగిన భారతీయ విద్యారంగం... 1835లో లార్డ్‌ మెకాలే రాకతో మారిపోయింది. ‘భారతీయ భాషలు మొరటైనవి. వెనకబడ్డవి. మన యూరోపియన్‌ గ్రంథాలతో పోల్చదగింది ఒక్కటి కూడా ఇక్కడ లేదు. వీరి చదువులు హేతువాదానికి దూరం. మూఢవిశ్వాసాలను నేర్పిస్తాయి. వీరిది తప్పుడు చరిత్ర, తప్పుడు ఖగోళం. ఆంగ్ల విద్య ద్వారా మనలా, మనకోసం ఆలోచించే భారతీయులను మనం తయారు చేయొచ్చు. వారిద్వారా ఈ దేశాన్ని పాలించొచ్చు’ అంటూ ఇంగ్లిష్‌ కాన్వెంట్‌ విద్యకు మెకాలే శ్రీకారం చుట్టించాడు. అది మొదలు... ఆంగ్లంపై మోజు పెంచారు. చదువు‘కొనటం’ మొదలైంది. డబ్బు పెట్టి ఆంగ్ల పాఠశాలలకు వెళ్లటం ప్రారంభమయ్యాక సామాజిక సమస్యలు పెరిగాయి. లేనివాళ్లు చదువులకు దూరమవటం, ఇంగ్లిష్‌ చదువుకున్న వారికి బ్రిటిష్‌ కొలువులు రావటం... ఇలా సమాజంలో అంతరాలు పెరిగాయి. బడుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ‘‘1857 నాటికి పంజాబ్‌లో 50వేల స్కూళ్లుంటే ఇప్పుడు 5వేలున్నాయి’’ అని 1920లో గాంధీజీ ఎత్తి చూపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని