Bengaluru: విమానాశ్రయంలో ఆధునిక రోసెన్‌బర్‌ అగ్నిమాపక సిమ్యులేటర్‌

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో.. అత్యాధునిక వ్యవస్థతో కూడిన రోసెన్‌బర్ అగ్నిమాపక సిమ్యులేటర్‌ను ఏర్పాటుచేశారు.

Published : 23 Nov 2021 23:58 IST

బెంగళూరు: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో.. అత్యాధునిక వ్యవస్థతో కూడిన రోసెన్‌బర్ అగ్నిమాపక సిమ్యులేటర్‌ను ఏర్పాటుచేశారు. అగ్నిమాపక యంత్రాలను నడపడంలో సిబ్బందికి సిమ్యులేటర్‌తో శిక్షణ అందిస్తున్నారు. దక్షిణాసియాలోనే రోసెన్‌బర్ సిమ్యులేటర్ ఉన్న ఏకైన విమానాశ్రయంగా బెంగళూరు విమానాశ్రయం నిలిచింది.

అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించి మంటలను ఆర్పేందుకు.. ఆస్ట్రియా కేంద్రంగా పని చేస్తున్న రోసెన్‌బర్‌ సంస్థ అత్యాధునిక వ్యవస్థతో కూడిన అగ్నిమాపక యంత్రాలను తయారు చేసింది. ముఖ్యంగా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనాస్థలికి వేగంగా చేరుకునేందుకు వీలుగా ఈ యంత్రాలను రూపొందించింది. రోసెన్‌బర్‌ అగ్నిమాపక యంత్రాలను దక్షణాసియాలోనే తొలిసారిగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. వీటిని నడపడంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రోసెన్‌బర్‌ సిమ్యులేటర్‌ను సైతం ఏర్పాటు చేశారు. 55 అంగుళాల హెచ్డీ తెర ఉండే ఈ సిమ్యులేటర్‌లో రోసెన్‌బర్‌ అగ్నిమాపక యంత్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. దీని వల్ల నిజమైన అగ్నిమాపక వాహనాలను నడిపిన అనుభూతి కలుగడం సహా సిబ్బందికి మెళకువలను నేర్పేందుకు వీలవుతుంది. ఈ సిమ్యులేటర్‌లో ఏర్పాటు చేసిన స్టీరింగ్, ఇతర వ్యవస్థల ద్వారా రోసెన్‌బర్‌ అగ్నిమాపక యంత్రం నియంత్రణ వ్యవస్థను అవగాహన చేసుకునే వీలుంటుంది. వీటిని ఆపరేట్‌ చేస్తూ ఘటనా స్థలంలో మంటలను ఆర్పేలా పూర్తిస్థాయిలో శిక్షణ పొందవచ్చు.

ఇప్పటికే 8 రోసెన్‌బర్ యంత్రాలను దిగుమతి చేసుకున్నట్టు బెంగళూరు విమానాశ్రయం అధికారులు చెప్పారు. భద్రత రీత్యా మరిన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దేశంలో ఉన్న ఇతర విమానాశ్రయాల సిబ్బందికి సైతం ఈ సిమ్యులేటర్‌ ద్వారా శిక్షణ ఇచ్చే అవకాశం ఉన్నట్టు వివరించారు. 

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని