B.1.621: బ్రిటన్‌లో కలవరం రేపుతున్న కొత్త రకం కరోనా వైరస్  

డెల్టా వేరియంట్‌ కారణంగా బ్రిటన్‌లో విధించిన ఆంక్షలను ఇప్పుడిప్పుడే సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో మరో కొత్త రకం బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

Published : 26 Jul 2021 01:58 IST

లండన్: డెల్టా వేరియంట్‌ కారణంగా బ్రిటన్‌లో విధించిన ఆంక్షలను ఇప్పుడిప్పుడే సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో మరో కొత్త రకం బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 16 మందిలో B.1.621 రకం వైరస్‌ను గుర్తించినట్లు బ్రిటన్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త రకం వైరస్‌ గురించి విచారణ జరుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. 16 కేసుల్లో పది కేసులను లండన్‌లోనే గుర్తించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణాల వల్లనే ఈ కేసులు బ్రిటన్‌లోకి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ వైరస్ ప్రభావం, సామూహిక వ్యాప్తి గురించి స్పష్టమైన సమాచారంలేదని తెలిపారు. ‘‘వైరస్ వ్యాప్తి, ప్రవర్తనను తెలుసుకునేందుకు లేబొరేటరీలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇతరులకు వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దీని ప్రభావం తక్కువగా ఉన్నట్లు గుర్తించాం’’ అని బిట్రన్ ఆరోగ్యశాఖ తెలిపింది. Ù 

బ్రిటన్‌లో కొత్త రకం వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఈ వేరియంట్‌ను తొలిసారిగా జనవరిలో కొలంబియాలో గుర్తించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ అమెరికాలో - 592 కేసులు, పోర్చుగల్‌ - 56, జపాన్ - 47, స్విట్జర్లాండ్‌ - 41 కేసులు గుర్తించినట్లు వెల్లడించారు. గత కొద్ది వారాలుగా బ్రిటన్‌లో డెల్టా వేరియంట్‌ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినా ఈ వారంలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం బ్రిటన్‌లో ఆర్ రేటు 1.2 నుంచి 1.4 శాతంగా ఉంది. దీని ప్రకారం కరోనా సోకిన వ్యక్తి వైరస్‌ను ఒకరి కంటే ఎక్కువ మందికి వ్యాప్తి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘వైరస్‌ గురించి భయపడుతూ ఉండేకంటే..దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలి’’ అని జావిద్‌ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే దీనిపై జావెద్ క్షమాపణలు చెప్పారు. ‘‘ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడాలనేది నా ఉద్దేశం. ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇందుకు నేను క్షమాపణలు చెబుతునున్నాను’’ అని జావిద్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని