అసెంబ్లీ పోల్స్‌: కీలక సమరానికి ముగిసిన ప్రచారం!

ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఇక తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు కీలక సమరానికి సిద్ధమయ్యాయి.

Updated : 04 Apr 2021 21:15 IST

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్‌

దిల్లీ: మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో అన్ని అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. అస్సాంలో మాత్రం మూడో విడత పోలింగ్‌ జరుగనుంది. దీంతో అక్కడ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుండగా, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఇది కాకుండా, మరో ఐదు విడతల్లో పోలింగ్‌ జరగనుంది.

ఏప్రిల్ 6న నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు.. అటు కేరళ (140), పుదుచ్చేరి (30)లోనూ అదే రోజు ఎన్నికల పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్‌, అస్సాంలలో ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్‌ పూర్తికాగా, 6వ తేదీన మూడో విడత పోలింగ్‌ జరుగుతుంది. పశ్చిమబెంగాల్‌లో 31 స్థానాలు, అస్సాంలో 40 అసెంబ్లీ స్థానాలు పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. అస్సాంలో ఇదే చివరి విడత కాగా, బెంగాల్‌లో మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి.

హోరాహోరీ ప్రచారం..

తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం రాజకీయ పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. తమిళనాడులో మూడోసారి అధికారాన్ని కొనసాగిస్తామని అన్నాడీఎంకే ధీమా వ్యక్తం చేస్తుండగా, ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని డీఎంకే కూటమి ప్రయత్నిస్తోంది. కేరళలో అధికార ఎల్డీఎఫ్‌, ప్రతిపక్ష యూడీఎఫ్‌ కూటములు గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఇదే సమయంలో రెండు కూటములతో ప్రజలు విసుగు చెందారని, ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా ప్రజలు భాజపా వైపే మొగ్గుచూపుతున్నారని కాషాయ పార్టీ చెప్పుకుంటోంది. ఇక పుదుచ్చేరిలోనూ ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలోనూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని