కొవిడ్‌ మూలాలు: ఏడాదైనా మిస్టరీగానే..!

తొలి కరోనా మరణం సంభవించి ఏడాది అయినప్పటికీ ఇంతవరకూ కరోనా వైరస్‌ మూలాలు తెలియక పోవడం శాస్త్రవేత్తల్లో అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది.

Updated : 10 Jan 2021 21:56 IST

జనవరి 11న తొలి కరోనా మరణం

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాలో పుట్టి యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి బయటపడి ఇప్పటికే సంవత్సరం పూర్తయ్యింది. ఇక తొలి కరోనా మరణం సంభవించి ఏడాది అయినప్పటికీ ఇంతవరకూ కరోనా వైరస్‌ మూలాలు తెలియక పోవడం శాస్త్రవేత్తల్లో అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. అయితే, అంతర్జాతీయ సమాజంతో వైరాన్ని నెరిపే చైనా, గోప్యత, గందరగోళ తనంతో ప్రపంచానికి కరోనా మూలాలను బహిర్గతం చేయడం కష్టమేనని అంతర్జాతీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు.

వుహాన్‌లో తొలి కరోనా మరణం..
2020లో జనవరి 11న వుహాన్‌లో తొలి కరోనా మరణం నమోదు అయ్యింది. నగరంలోని ఓ మాంసాహార మార్కెట్‌కు చెందిన ఓ 61ఏళ్ల వ్యక్తి కరోనా సోకి ప్రాణాలు కోల్పోయినట్లు చైనా వెల్లడించింది. నాటి నుంచి ఇప్పటివరకు ఈ సంవత్సరం కాలంలోనే యావత్‌ ప్రపంచాన్ని చుట్టుముట్టి దాదాపు 18లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. చైనాలో వైరస్‌ వ్యాప్తి, మరణాలను నియంత్రించగలిగినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా విజృంభణ కొనసాగిస్తూనే ఉంది.

వుహాన్ ల్యాబ్‌ నుంచే..?
మానవులకు సోకిన ఈ వైరస్‌ గబ్బిలాల నుంచే వ్యాపించి అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇలా భావిస్తోన్న సమయంలో కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యిందని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు యావత్‌ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేశాయి. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఫెడెరల్‌ అధికారులు పలుసార్లు బహిరంగంగానే వెల్లడించారు. వాటికి సంభందించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నప్పటికీ వాటిని మాత్రం బహిర్గతం చేయలేదు. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా కొవిడ్‌ మూలాలపై అనుమానాలు వ్యక్తంచేశాయి. అసలు వైరస్‌ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా జంతువుల నుంచి మానవులకు వైరస్‌ ఎలా సోకిందనే విషయం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.

అంతకుముందే బయటపడిన వైరస్‌..
2019 డిసెంబర్‌లో కరోనా కేసులు బయటపడినట్లు చైనా చెబుతున్నప్పటికీ.. అంతకు ముందే(2019 మార్చిలోనే ) వైరస్‌ వ్యాప్తి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మానవుల మధ్య వైరస్‌ అత్యంత వేగంతో వైరస్‌ వ్యాపించాలంటే కొన్ని మ్యుటేషన్లు జరిగాలని, అందుకే అప్పటికే సంవత్సరం ముందే అక్కడ వైరస్‌ బయటపడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వీటికి సంబంధిచన వివరాలపై చైనా మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

ముందునుంచి అనుమానాలే..
కరోనా వైరస్‌ బయటపడిన తర్వాత అప్రమత్తమైన చైనా.. వీటికి సంబంధించి జెనెటిక్‌ సీక్వెన్స్‌ను 2020 జనవరి 10వ తేదీన విడుదల చేసి చేతులు దులుపుకుంది. వైరస్‌ బయటపడిన తొలినాళ్లలో వీటి మూలాలపై చైనా గోప్యత పాటించడంతో పాటు, వాటిపై ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించిందనే అనుమానాలు ఉన్నాయి. అంతేకాకుండా, మనుషుల మధ్య వైరస్‌ సంక్రమిస్తుందనే విషయాన్ని కూడా ప్రపంచానికి తెలియకుండా దాచిందనే వాదన కూడా ఉంది. తొలుత వుహాన్‌ మార్కెట్‌లోనే వైరస్‌ బయటపడిందని వెల్లడించిన చైనా అధికారులు, వైరస్‌ విదేశాలకు వ్యాపించడంతో రెండు నెలలకే మాటమార్చింది. వైరస్‌ మూలాలకు వుహాన్‌ మార్కెట్‌తో సంబంధం లేదని, కేవలం ఇక్కడి వ్యక్తిలో వైరస్‌ గుర్తించినట్లు చైనా వ్యాధి నియంత్రణ అధికారులు కొత్త వాదన మొదలుపెట్టారు. వైరస్‌ వ్యాప్తి, కేసులకు సంబంధించిన నివేదికలను విడుదల చేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.

దర్యాప్తునకు ఆంటకమే..
కరోనా వైరస్‌ మూలాలపై చైనా గోప్యత పాటిస్తుందని నిర్ధారణ కావడంతో వాటిపై దర్యాప్తు జరపాలని ప్రపంచదేశాలు ఒత్తిడి చేశాయి. దీంతో స్వతంత్ర దర్యాప్తు బృందంతో మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. చివరకు ఈ దర్యాప్తునకు అంగీకరించిన చైనా, నిపుణులను మాత్రం దేశంలోకి అడుగుపెట్టనీయడం లేదు. ఈ నేపథ్యంలో చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అసహనం వ్యక్తంచేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఏడాది తర్వాత మూలాల దొరకడం కష్టమే..
ఇలా ఎన్నో సాకులు, గందరగోళం సృష్టిస్తూ, గోప్యత పాటిస్తోన్న చైనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టికాయలు వేయడంతో, దర్యాప్తునకు సహకరిస్తామని ప్రకటించింది. అయితే, తొలి కరోనా మరణం సంభవించి ఏడాది సుదీర్ఘ సమయం కావడం, ఇప్పటికే వాటికి సంబంధించిన రుజువులు, కీలక సమాచారాన్ని చైనా ధ్వంసం చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోప్యత పాటించడానికి చైనాకు ఉన్న కారణాలు తెలియనప్పటికీ, ఇలాంటి సమాచారాన్ని నాశనం చేయడంలో ఆ దేశానికి గొప్ప చరిత్ర ఉందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ విజృంభణ సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులను యావత్‌ ప్రపంచానికి తెలిపేందుకు ప్రయత్నించిన పౌరులు, జర్నలిస్టులను కూడా జైలుకు పంపిన ఘటనలను ఉదహరిస్తున్నారు.

మూలాలు తెలుసుకోలేకుంటే ప్రమాదమే..
యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి అసలు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు. వాటి మూలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఈ తరహా విజృంభణలను ముందుగానే అంచనా వేయడం వీలవుతుందని ప్రముఖ వైరాలజిస్టులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తితే తీవ్రత ఎందుకు పెరుగుతోందన్న విషయాన్ని పరిశోధించి కట్టడి చేసేందుకు వీలుంటుందని అంటువ్యాధుల నిపుణులు పీటర్‌ డస్‌జక్‌ పేర్కొన్నారు. దీంతో వైరస్‌కు కారణమైన పక్షులు, జంతువులను వధించడమో, వాటిపై వేటను నిషేధించడం, వాటితో సన్నిహితంగా మెలగకుండా ప్రజలకు జాగ్రత్తలు సూచించడం, వైరస్‌ సోకిన వారిని క్వారంటైన్‌లో ఉంచే విధాలను రూపొందించుకునేందుకు ఈ మూలాలు తెలుసుకోవడం ఎంతో కీలకమని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి..
చైనా నగరాల్లో లాక్‌డౌన్‌
కొవిడ్‌19: మూలాలపై దర్యాప్తు
చైనా టీకాల సామర్థ్యంపై ఇంకా అనిశ్చితే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని