గంగానదిలో మళ్లీ శవాల కలకలం!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని గంగానదిలో మరోసారి పెద్ద సంఖ్యలో మృతదేహాలు కనిపించాయి. అయితే, ఇవి కొవిడ్‌ మృతదేహాలా? కాదా?

Updated : 15 May 2021 17:07 IST

నది పిలుస్తోందని చెప్పి.. విలపించేలా చేస్తున్నారంటూ రాహుల్‌ విమర్శలు 

ఘాజీపూర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ ఘాజీపూర్‌లోని గంగానదిలో మరోసారి పెద్ద సంఖ్యలో మృతదేహాలు కనిపించాయి. అయితే, ఇవి కొవిడ్‌ మృతదేహాలా? కాదా? అనే విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఈ ఉదయం మృతదేహాలు నదిలో కొట్టుకు రాగా.. దూరంగా ఉన్న ఇసుక దిబ్బల్లో స్థానికులు వీటిని గుర్తించారు. ఇటీవల గంగా నదిలో కొవిడ్‌ మృతదేహాలను ఖననం చేస్తున్నట్టు వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భౌతికకాయాలు కనిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. 

ప్రధానిపై రాహుల్‌ పరోక్ష విమర్శలు
అయితే, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పరోక్ష విమర్శలు చేశారు. గంగా నది పిలస్తోందని వ్యాఖ్యలు చేసిన వారే ఇప్పుడు నదిని విలపించేలా చేస్తున్నారంటూ పేర్కొన్నారు. గంగానదిలో శవాలు కొట్టుకురావడంపై ఈ మేరకు ట్విటర్‌లో విమర్శించారు. 1140 కి.మీల పొడవైన గంగానది తీరప్రాంతంలో ఇప్పటివరకు 2వేలకు పైగా శవాలను గుర్తించినట్టు పేర్కొన్న ఓ వార్తను రాహుల్‌ తన ట్వీట్‌కు జతచేశారు. కొద్ది రోజులుగా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లలోని గంగానదీ పరివాహక ప్రాంతాల్లో అనేక శవాలను అధికారులు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని