3నెలల్లో 500 ఆక్సిజన్‌ ప్లాంట్లు సిద్ధం: డీఆర్‌డీఓ

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణతో ఏర్పడిన ఆక్సిజన్‌ కొరత సమస్యను అధిగమించేందుకు భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 500 మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను (MOP) ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

Updated : 29 Apr 2021 10:01 IST

తేజస్‌ యుద్ధవిమానాల సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణతో ఏర్పడిన ఆక్సిజన్‌ కొరత సమస్యను అధిగమించేందుకు భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 500 మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను (MOP) ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తేజస్‌ యుద్ధవిమానాలకు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని అభివృద్ధి చేస్తున్నట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది. పీఎంకేర్స్‌ నిధి కింద దేశవ్యాప్తంగా మూడు నెలల్లోగా అందుబాటులోకి తెస్తామని డీఆర్‌డీఓ తెలిపింది.

దేశవ్యాప్తంగా మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్ల(MOP) ఏర్పాటు ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టామని డీఆర్‌డీఓ పేర్కొంది. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌(332), కోయంబత్తూర్‌కు చెందిన ట్రైడెంట్‌ న్యూమాటిక్స్‌(48) సంస్థలు ప్లాంట్లను ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యాయని తెలిపింది. ఈ 380 ఆక్సిజన్‌ ప్లాంట్లు కేవలం మూడు నెలల్లోనే అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. నిమిషానికి 500 లీటర్ల సామర్థ్యం కలిగిన మరో 120 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం(డెహ్రాడూన్‌) ఏర్పాటు చేస్తుందని డీఆర్‌డీఓ వెల్లడించింది. వీటి ఏర్పాటుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే ఆయా సంస్థలకు అందించినట్లు తెలిపింది. ఈ నూతన ప్లాంట్ల ద్వారా ఆసుపత్రుల్లోని పడకలకే నేరుగా ఆక్సిజన్‌ సరఫరా చేసే సదుపాయం ఏర్పడుతుందని డీఆర్‌డీఓ తెలిపింది.

ఈ ప్లాంట్లు ద్వారా నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ సామర్థ్యం కలిగి ఉంటాయని.. వీటి వల్ల ఒకేసారి దాదాపు 190 రోగులకు ప్రాణవాయువు అందించవచ్చని డీఆర్‌డీఓ పేర్కొంది. ప్రెషర్‌ స్వింగ్‌ యాడ్సర్ప్షన్(పీఎస్‌ఏ), మాలిక్యూలర్‌ సైవీ(జియోలైట్‌) సాంకేతిక పరిజ్ఞానంతో గాలి నుంచి నేరుగా ఆక్సిజన్‌ తయారు చేస్తాయని డీఆర్‌డీఓ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని