Corona: టీకాలు వేసినా ఎప్పటికీ మనతోనే.. ఎందుకంటే?

కరోనా వైరస్‌ ఎప్పటికీ మనతోనే ఉంటుందనే విషయాన్ని గుర్తుచేస్తున్న నిపుణులు.. రానున్న రోజుల్లో వైరస్‌ తీవ్రత మాత్రం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

Published : 23 Jun 2021 01:24 IST

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పు ఎప్పటికి అంతమవుతుందో నిపుణులే అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. టీకాల ద్వారా ప్రజల్లో ఇమ్యూనిటీ పెంచాలని ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కొత్తరకాలు పుట్టుకు వస్తుండడంతో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేందుకు మరింత కాలం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ ఎప్పటికీ మనతోనే ఉంటుందని, కాకపోతే రానున్న రోజుల్లో దాని తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కొవిడ్‌ నిర్మూలన సాధ్యమేనా?

కొవిడ్‌ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనా అన్న పశ్నకు నిపుణుల నుంచి ‘కాదు’ అనే సమాధానం వస్తోంది. ఇప్పటివరకు కేవలం మశూచిని మాత్రమే పూర్తిగా పారద్రోలిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కరోనా వైరస్‌కు కారణమైన సార్స్‌-కోవ్‌-2ను మాత్రం పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని చెబుతున్నారు. కఠిన లాక్‌డౌన్‌లు, సరిహద్దులు మూసివేయడం తదితర చర్యలతో కరోనా కేసుల సంఖ్యను న్యూజిలాండ్‌లాంటి దేశాలు సున్నాకు తీసుకువచ్చినా.. అది అన్ని దేశాలకు సాధ్యం కాదని చెబుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్య ఆదాయ దేశాలకు ఇది సవాల్‌గా మారుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

టీకాలతో వైరస్‌ కట్టడి ఎంతవరకు?

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు సమర్థవంతంగానే పనిచేస్తున్నప్పటికీ.. వాటివల్ల ఎంతకాలం రక్షణ ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. వైరస్‌ నుంచి ఒకవేళ అవి సుదీర్ఘకాలం రక్షణ కల్పించగలిగితే, హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడానికి 60 నుంచి 72శాతం మందికి వాక్సినేషన్‌ జరగాల్సి ఉంటుందని లాన్సెట్‌ నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. ఇలా వ్యాక్సిన్ల సామర్థ్యం, అవి కల్పించే రక్షణ ఎంతకాలం ఉంటుందనే దానిపై వైరస్‌ కట్టడి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కొత్త వేరియంట్ల ప్రభావమెంత?

కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నకొద్దీ అది రూపాంతరం చెందుతోంది. గతంలో సాధించిన ఇమ్యూనిటీ నుంచి తప్పించుకొంటూ, తిరిగి ప్రభావం చూపే సామర్థ్యం కరోనాకు ఉండడంతో కొత్త వేరియంట్లపై ఆందోళన నెలకొంది. బ్రిటన్‌, దక్షిణ అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లో వెలుగు చూసిన కొత్త వేరియంట్లు వైరస్‌ వ్యాప్తిని వేగవంతం చేయడంతో పాటు, వ్యాక్సిన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది. అందుకే కొత్త వేరియంట్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. దీంతో ఇప్పటికే బూస్టర్ డోసులను అభివృద్ధి చేసే పనిలో ఆయా వ్యాక్సిన్‌ సంస్థలు నిమగ్నమయ్యాయి.

కేసులను తగ్గించడంలో టీకాల పాత్ర

వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా ఇతరులకు వైరస్‌ సోకకుండా ఉంటుందా?అనే ప్రశ్నకు కాదనే సమాధానం వస్తోంది. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్నవారు వైరస్‌కు గురైనప్పుడు వారిలో రోగ తీవ్రతను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. టీకా తీసుకున్నాక కూడా ఇన్‌ఫెక్షన్‌కు గురైన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నుంచి ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైరస్‌ను పూర్తిగా నిర్మూలించడంపై దృష్టిపెట్టడం కాకుండా, దానివల్ల ఆస్పత్రిలో చేరడం, ప్రాణనష్టం, ఆర్థిక భారంలాంటివి తగ్గించడమే కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగాధిపతి మైక్‌ రేయాన్‌ చెప్పారు.

పూర్తిగా నియంత్రించలేకపోతే..?

కొవిడ్‌-19ను పూర్తిగా నియంత్రించలేకపోతే పరిస్థితి ఏంటనేది మరో ప్రశ్న. అయితే, ప్రజాసమూహాల్లో వైరస్‌లు ఇలా వ్యాప్తిచెందుతోంటే.. కొంతకాలం తర్వాత వాటి ప్రభావం తగ్గి, అవి స్థానికంగా వ్యాప్తిచెందేవి(ఎండమిక్‌)గా మారే అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో దాదాపు 100మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తలపై నేచర్‌ పత్రిక జరిపిన ఓ సర్వేలో 90శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాధారణ జలుబు వంటివి ఇలాంటి కోవకే వస్తాయని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

భవిష్యత్తులో ఎలాంటి ప్రభావాలు?

వైరస్‌నుంచి కోలుకున్నవారితో పాటు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కరోనా నుంచి కొంతకాలం రక్షణ ఉంటుంది. ఇక రెండోసారి వైరస్‌ సోకినవారిలో కూడా యాంటీబాడీలు సమృద్ధిగానే ఉంటున్నాయి. కేవలం రోగనిరోధకత తక్కువగా ఉన్నవారు, వ్యాక్సిన్‌ తీసుకోనివారే వైరస్‌ వల్ల తీవ్ర ముప్పుకు గురవుతారు. కరోనాపై హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించేంత వరకు లేదా ఎండమిక్‌ స్థాయి వచ్చే వరకు ఇలాంటి ప్రమాదం తప్పదు. ఆ తర్వాత కాలం గడిచేకొద్దీ కరోనా కూడా సాధారణ జలుబులాగే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని