ఏడాదిలో తొలి దేశీయ విమాన వాహక నౌక సిద్ధం

గత ఏడాది గల్వాన్‌ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణ తర్వాత భారత నావికాదళం చూపిన అప్రమత్తతను కేంద్ర రక్షణశాఖ మంత్రి  రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. తాము సామరస్యపూర్వక పరిష్కారాన్నే కోరుకుంటున్నట్లు...

Published : 25 Jun 2021 23:17 IST

రక్షణ వ్యవస్థ బలోపేతమవుతుందని రాజ్‌నాథ్‌ ధీమా

కొచ్చి: గత ఏడాది గల్వాన్‌ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణ తర్వాత భారత నావికాదళం చూపిన అప్రమత్తతను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. తాము సామరస్యపూర్వక పరిష్కారాన్నే కోరుకుంటున్నట్లు భారత్‌ ఆ సమయంలో స్పష్టమైన సంకేతాలు పంపిందన్నారు. కానీ, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి భారత్‌ నిరంతరం సిద్ధంగా ఉందని తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తొలి విమాన వాహక నౌక పనుల పురోగతిని రాజ్‌నాథ్‌ శుక్రవారం కొచ్చిలో పర్యవేక్షించారు.

తొలి దేశీయ విమాన వాహక నౌక(ఐఏసీ)ను వచ్చే ఏడాది నాటికి నావికాదళంలోకి ప్రవేశపెడతామని రాజ్‌నాథ్‌ తెలిపారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత్‌కు ఇస్తున్న గొప్ప నివాళి ఇదేనని వ్యాఖ్యానించారు. స్వయంసమృద్ధ భారతావనికి ఇది నిదర్శనమన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టు కొవిడ్‌ సంక్షోభంలోనూ వేగంగా దూసుకెళ్లిందని తెలిపారు. ఈ ఐఏసీ పోరాట సామర్థ్యం, లక్ష ఛేదన, బహుముఖ ప్రజ్ఞ మన దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. తద్వారా సముద్ర జలాల్లో భారత ప్రయోజనాలను కాపాడుతుందన్నారు.

రక్షణ వ్యవస్థ ఆధునికీకరణలో స్వదేశీ పరిశ్రమలను భాగస్వామ్యం చేయడం, వాటి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికే తొలి ప్రాధాన్యం ఇస్తామని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. భారత షిప్‌యార్డుల వద్ద నిర్మిస్తున్న 44 యుద్ధనౌకలలో 42 దీనికి నిదర్శనమని రక్షణ మంత్రి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని