భారత్‌తో విభేదాలు తాత్కాలికమే: మలేషియా

పామాయిల్‌ దిగుమతి విషయంలో భారత్‌తో తలెత్తిన విభేదాలు తాత్కాలికమేనని మలేషియా చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ సమస్యకు ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు.......

Published : 04 Feb 2020 11:55 IST

కౌలాలంపూర్‌: పామాయిల్‌ దిగుమతి విషయంలో భారత్‌తో తలెత్తిన విభేదాలు తాత్కాలికమేనని మలేషియా చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ సమస్యకు ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. ఈ మేరకు ఆ దేశ పామాయిల్‌ కౌన్సిల్‌ ప్రకటన విడుదల చేసింది. ఆ దేశ పరశ్రమలశాఖ మంత్రి అక్కడి వ్యాపారులకు హామీ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు.

కొన్నాళ్ల కిందట ఐరాస సర్వసభ్య సమావేశంలో మలేషియా ప్రధాని మహతీర్‌ మహ్మద్‌ భారత అంతర్గత విషయమైన అధికరణ 370 రద్దు అంశాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత పౌరసత్వ సవరణ చట్టంపై కూడా భారత్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా మలేషియా దిగుమతులపై భారత్‌ ఆంక్షలు విధించింది. మలేషియా నుంచి పామాయిల్‌ కొనుగోలు చేయరాదని దేశీయ వ్యాపారులను ఆదేశించింది. దీంతో భారత్‌కు అతిపెద్ద పామాయిల్‌ ఎగుమతిదారుగా ఉన్న ఆ దేశంపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 

పామాయిల్‌కు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలు మలేషియా, ఇండోనేషియా. ఇక మలేషియాకు అతిపెద్ద దిగుమతిదారు భారత్‌. గతేడాది ఈ దేశం నుంచి 4.4 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు మలేషియా ఎగుమతుల విలువ 10.8 బిలియన్‌ డాలర్లు ఉండొచ్చని అంచనా. ఇక దిగుమతుల విలువ 6.4 బిలియన్‌ డాలర్లుగా ఉండనుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని