
మాజీ ఐఏఎస్పై ప్రజా భద్రతా చట్టం
శ్రీనగర్: మాజీ ఐఏఎస్ అధికారి, జమ్మూకశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ(జేకేపీఎం) చీఫ్ షా ఫైజల్పై పోలీసులు కఠినమైన ప్రజా భద్రతా చట్టాన్ని(పీఎస్ఏ) ప్రయోగించారు. అదే రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా సహా మరికొంత మంది నేతలు ఇప్పటికే ఇదే చట్టం కింద నిర్బంధంలో ఉన్నారు. ఆగస్టు 5న అధికరణ 370 రద్దు చేసిన తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫైజల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఎస్ఏ కింద అరెస్టు చేసిన వారిని రెండేళ్ల పాటు ఎలాంటి విచారణ లేకుండా జైల్లో ఉంచే అధికారం పోలీసులకు ఉంటుంది.
మరోవైపు ఒమర్ అబ్దుల్లాపై పీఎస్ఏ ప్రయోగించడాన్ని ఆయన సోదరి సారా అబ్దుల్లా పైలట్ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. సారా పిటిషన్పై వివరణ ఇవ్వాలని జమ్మూకశ్మీర్ పాలకవర్గాన్ని ఆదేశించింది.