
‘వైరస్ కచ్చితంగా ఆ ల్యాబ్ నుంచే వచ్చింది’
చైనాపై ఆరోపణల్లో పదును పెంచిన అమెరికా
వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాప్తికి చైనాయే కారణమని ఆరోపిస్తున్న అమెరికా రోజురోజుకీ డ్రాగన్పై చేస్తున్న విమర్శలకు పదును పెడుతోంది. తాజాగా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వుహాన్ వైరాలజీ ప్రయోగశాల నుంచే వచ్చిందనడానికి అపారమైన ఆధారాలున్నాయని తెలిపారు. అయితే, చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ వైరస్ను బయటకు వదిలి ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మాత్రం పాంపియో నిరాకరించడం గమనార్హం. ఓ ప్రముఖ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వైరస్ తీవ్రతకు సంబంధించిన సమాచారాన్ని చైనా కావాలనే తొక్కిపెట్టిందని.. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఉపద్రవానికి డ్రాగన్ దేశానిదే బాధ్యత అని పాంపియో ఆరోపించారు. అమెరికా స్థానిక మీడియా కథనాల ప్రకారం.. వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ ఉద్భవించిందనడానికి మరిన్ని బలమైన ఆధారాలు సేకరించాలని ట్రంప్ నిఘావర్గాలను ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో నిఘా సంస్థల్లో పనిచేసిన అనుభవమున్న పాంపియో.. వైరస్ మానవ సృష్టి కాదన్న సంస్థల నివేదికలను అంగీకరిస్తూనే చైనాపై ఆరోపణలు గుప్పించడం గమనార్హం. గతంలోనూ ప్రపంచం మొత్తానికి అంటువ్యాధుల్ని అంటించిన చరిత్ర చైనాకు ఉందని ఆరోపించారు. తొలినాళ్లలో వైరస్కు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టడమే ఈ పరిస్థితులకు దారితీసిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులకు చైనాను బాధ్యురాలిగా చేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..