
6నెలల్లో 94మంది ఉగ్రవాదులు హతం!
కశ్మీర్ ఐజీ వెల్లడి!
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 94మంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. దక్షిణ కశ్మీర్లోని షోపియన్ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్ జరిగిన అనంతరం ఐజీ ఈ వివరాలు వెల్లడించారు. మంగళవారం జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉన్న ఉత్తర కశ్మీర్లో కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
ఇదిలా ఉంటే, అనంత్నాగ్లో ఈ నెల 8న ఉగ్రవాదుల చేతిలో స్థానిక సర్పంచ్ అజయ్ పండిట్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ఉగ్రవాది ఉమర్ ఈ హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం తేలిందని విజయ్ కుమార్ వెల్లడించారు. అయితే ఈ హత్య చేసిన అనుమానిత ఉగ్రవాది ఇప్పటికే భద్రతా దళాల చేతిలో హతమైనట్లు గుర్తించారు. ఈ సమయంలో ప్రాణహాని ఉన్న సర్పంచ్లు, రక్షణ కోసం స్థానిక పోలీసులను సంప్రదించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.