Space: బ్రిటన్‌ కుబేరుడి రోదసి యాత్ర రేపే

రోదసిలో ప్రయాణించిన తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థ అధిపతిగా బ్రిటన్‌ కుబేరుడు

Updated : 10 Jul 2021 13:37 IST

తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థ అధిపతిగా ఈ ఘనత సాధించనున్న రిచర్డ్‌ బ్రాన్సన్‌

న్యూయార్క్‌: రోదసిలో ప్రయాణించిన తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థ అధిపతిగా బ్రిటన్‌ కుబేరుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ చరిత్ర సృష్టించనున్నారు! ఆదివారం నాడు ఆయన న్యూ మెక్సికోలోని ప్రైవేటు స్పేస్‌పోర్టు నుంచి తన ‘వర్జిన్‌ గలాక్టిక్‌ వీఎస్‌ఎస్‌ యూనిటీ’ అంతరిక్ష నౌక ద్వారా నింగిలో విహరిస్తారు. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వర్జిన్‌ గ్రూప్‌ విమానం ‘వీఎంఎస్‌ ఈవ్‌’... తన 140 అడుగుల రెక్కల తోడుతో యూనిటీని నింగిలోకి తీసుకెళ్తుంది. 9 మైళ్ల దూరం ప్రయాణించిన తర్వాత అది ఈవ్‌ నుంచి విడిపోయి, అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. భూమి నుంచి 50 మైళ్ల దూరం వెళ్లాక అంతరిక్షంలో ప్రవేశించినట్టు భావిస్తారు. అయితే ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ యూనిటీ 55 మైళ్లు దాటి ప్రయాణిస్తుందని, అనంతరం మళ్లీ నేరుగా స్పేస్‌పోర్టుకు చేరుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సుమారు 90 నిమిషాలపాటు ఈ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నాయి. యూనిటీలో రిచర్డ్‌తో పాటు ఇద్దరు పైలట్లు, వర్జిన్‌ గలాక్టిక్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఈ నౌక ద్వారా వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు వ్యక్తులను అంతరిక్ష యాత్రకు తీసుకెళ్లాలని వర్జిన్‌ గలాక్టిక్‌ భావిస్తోంది.

వినియోగదారుల అనుభూతిని మదింపు చేస్తా: రిచర్డ్‌ 

‘‘ఈ జులైలో మా కల నెరవేరబోతోంది. యూనిటీలో ఒక వినియోగదారుడు ఎలా అనుభూతి చెందుతాడన్నది నేను స్వయంగా మదింపు చేస్తాను. నాకు తోడుగా విశేష ప్రతిభావంతులైన సిబ్బంది ఉండటం వర్జిన్‌ గలాక్టిక్‌ వ్యవస్థాపకుడిగా నాకెంతో గర్వకారణం’’ అని రిచర్డ్‌ తన ట్విటర్‌ సందేశంలో పేర్కొన్నారు.

తోడు వెళ్లనున్న బండ్ల శిరీష

రిచర్డ్‌తో పాటు వీఎస్‌ఎస్‌ యూనిటీలో ప్రయాణించే వారిలో గుంటూరుకు చెందిన బండ్ల శిరీష (33) కూడా ఉండటం విశేషం! అమెరికాలోని జార్జ్‌టౌన్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తిచేసిన శిరీష... 2015లో వర్జిన్‌ గలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల విభాగ మేనేజరుగా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం గవర్నమెంట్‌ ఎఫైర్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆపరేషన్స్‌ విభాగం ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని