గర్భస్థ శిశువులపై కాలుష్య కాటు.. నెలలు నిండకముందే జననం 

వాయు కాలుష్యం మానవాళికి చేస్తున్న చేటు అంతాఇంతా కాదు! నెలలు నిండకముందే బిడ్డలు పుట్టడానికి ఇది

Updated : 01 Oct 2021 12:59 IST

పురిటిలోనే మరణం...
కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధనలో వెల్లడి

లాస్‌ ఏంజెలెస్‌: వాయు కాలుష్యం మానవాళికి చేస్తున్న చేటు అంతాఇంతా కాదు! నెలలు నిండకముందే బిడ్డలు పుట్టడానికి ఇది కారణమవుతున్నట్టు కాలిఫోర్నియా వర్సిటీ హెచ్చరించింది. ఈ అంశంపై చేపట్టిన పరిశోధన ఫలితాలను బుధవారం వెల్లడించింది. వాయు కాలుష్యం ఇంటా, బయటా చూపుతున్న ప్రభావాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం సాగించారు. ఇందుకు సంబంధించి 204 దేశాల నుంచి డేటాను సేకరించి, విశ్లేషించారు. 

2019లో 60 లక్షల శిశువులు ఇలా..

‘‘గాలిలో ఉండే పీఎం 2.5 (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌-2.5) పరిమాణంలోని కాలుష్య కారక రేణువులు, వంట కారణంగా వెలువడే పొగ... గర్భిణులపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా నెలలు నిండకముందే కాన్పు కావడానికి దారితీస్తున్నాయి. ఒక్క 2019లోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది శిశువులు నెలలు నిండకముందే జన్మించారు. మరో 30 లక్షల మంది తక్కువ బరువుతో పుట్టారు. ఈ పరిస్థితి కారణంగా నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఇలా జన్మించినవారు జీవితాంతం తీవ్రస్థాయి రుగ్మతలతో సతమతమయ్యే ప్రమాదముంది’’ అని పరిశోధనకర్త రాకేశ్‌ ఘోష్‌ తెలిపారు. ప్రపంచంలో 90 శాతానికి పైగా మంది బహిరంగ ప్రదేశాల్లో వాయు కాలుష్యానికి గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో పేర్కొంది. వంట చేసే నిమిత్తం బొగ్గు, పిడకలు, కలపను కాల్చడం ద్వారా కోట్ల మంది ఇళ్లలో కాలుష్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని ప్రస్తావించిన కాలిఫోర్నియా పరిశోధకులు... కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 78% వరకూ ముందస్తు జననాలను నివారించవచ్చని పేర్కొన్నారు.

కొవిడ్‌ రెండోదశలో గర్భస్రావాలు మూడింతలు: ఐసీఎంఆర్‌ అధ్యయనం

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ మొదటి దశతో పోల్చితే, రెండో దశలో గర్భస్రావాల రేటు మూడింతలు పెరిగినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనంలో వెల్లడైంది. డెల్టా తదితర ప్రమాదకర వేరియంట్ల ప్రభావం, కొవిడ్‌ నిబంధనలతో గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లలేకపోవడం, పోషకాహారలేమి గర్భస్రావాలకు ప్రధాన కారణాలుగా తేల్చారు. ముంబయిలోని బి.వై.ఎల్‌.నాయర్‌ ఛారిటబుల్‌ ఆసుపత్రిలో... నిరుడు ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది జులై 4 వరకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన మొత్తం 1,630 మంది ఆకస్మిక గర్భస్రావానికి గురయ్యారు. వీరి ఆరోగ్య వివరాలను అధ్యయనకర్తలు విశ్లేషించారు. 20 వారాల గర్భాన్ని కోల్పోవడం, 500 గ్రాముల కన్నా తక్కువ బరువున్న శిశువులు జన్మించడం గర్భస్రావం కిందకు వస్తుందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. కొవిడ్‌ తొలిదశలో ప్రతి వెయ్యి కాన్పులకు 26.7 గర్భస్రావాలు కాగా, రెండో దశలో 82.6 గర్భస్రావాలు చోటుచేసుకున్నట్టు గుర్తించారు. ఐసీఎంఆర్‌ మునుపటి అధ్యయనంలో, కొవిడ్‌ మొదటి దశలో కన్నా రెండో దశలోనే పురుటి తల్లుల మరణాలు ఎక్కువగా ఉన్నట్టు తేల్చింది. భారత్, ఇతర పరిమిత ఆదాయ దేశాల్లోని గర్భిణులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించాల్సిన ఆవశ్యకతను తమ అధ్యయనం చాటిచెబుతోందని ఐసీఎంఆర్‌ నిపుణులు పేర్కొన్నారు. ఈ వివరాలను ‘ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ అల్ట్రాసౌండ్‌ ఇన్‌ ఒబెస్ట్రీస్‌ అండ్‌ గైనకాలజీ’ పత్రిక ప్రచురించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని