
Alcohol: తాగితే రాత్రంతా బోనులోనే!
అహ్మదాబాద్: గుజరాత్కు చెందిన ‘నాట్’ పెద్దలు తమ సామాజికవర్గానికి చెందినవారెవరూ తాగుడు జోలికి పోకుండా సరికొత్త ఆలోచన చేశారు. మద్యం తాగి కనబడేవారిని పట్టుకుని బోనులో వేస్తున్నారు. అహ్మదాబాద్ జిల్లా, మోతిపుర గ్రామానికి చెందిన నాట్ కమ్యూనిటీ పెద్దలు మద్యం తాగినవారిని నిర్బంధించేందుకు ఊరి మధ్యలో బోను ఏర్పాటు చేయాలని 2019లో తీర్మానించారు. జరిమానా కూడా విధించాలని నిర్ణయించారు. తాగుబోతులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మందుబాబులను రాత్రంతా బోనులో ఉంచుతారు. ఆ సమయంలో వారికి మంచినీళ్ల సీసా మాత్రమే ఇస్తారు. ఈ విధానం చాలామందిలో పరివర్తన తీసుకొచ్చింది. గృహహింస కేసులు కూడా తగ్గాయి. దీంతో జామ్నగర్, అమ్రేలి, భావ్నగర్, సురేంద్రనగర్ జిల్లాలకు చెందిన 24 గ్రామాల నాట్ పెద్దలు కూడా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. జరిమానా రూపంలో వసూలైన డబ్బులను సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకూ, వితంతువులు, నిరుపేద మహిళల వివాహాలకూ వినియోగిస్తున్నట్టు మోతిపుర సర్పంచి రాజేశ్ నాయక్ తెలిపారు.