జీ-7 సదస్సులో కరోనా కలకలం!

రెండు రోజులపాటు లండన్‌లో జరుగుతోన్న జీ-7 విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది.

Published : 05 May 2021 16:08 IST

భారత బృందంలో ఇద్దరికి కరోనా
వర్చువల్‌గా పాల్గొంటానన్న విదేశాంగమంత్రి

లండన్‌: లండన్‌లో జరుగుతోన్న జీ-7 విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. భారత్‌ తరపున హాజరైన ప్రతినిధి బృందంలో ఇద్దరికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో భారత బృందం మొత్తం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌కు మాత్రం పాజిటివ్‌ రాలేదని అక్కడి మీడియా వెల్లడించింది.

‘బృంద సభ్యుల్లో కొందరు వైరస్‌కు గురైనట్లు తెలిసింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా నేను పాల్గొనాల్సిన అన్ని కార్యక్రమాలను వర్చువల్‌ ద్వారా పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. నేడు జరిగే జీ7 సమావేశంలోనూ వర్చువల్‌ పద్ధతిలోనే పాల్గొంటాను’ అని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

రెండురోజుల పాటు జరుగనున్న జీ-7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం లండన్‌లో జరుగుతోంది. సభ్య దేశాలతో పాటు ఆతిథ్య దేశ హోదాలో భారత్‌ ఈ సమావేశాల్లో ప్రత్యక్షంగా పాల్గొంది. ఇందులో భాగంగా విదేశాంగశాఖ మంత్రి నేతృత్వంలోని భారత బృందం అక్కడకు చేరుకుంది. జీ7 శాశ్వత సభ్య దేశాలతో పాటు భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా దేశాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని