Rahul Gandhi: భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ పరిస్థితులు: రాహుల్ గాంధీ

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ తరహా పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్​లోని ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజల మేలు కోసం ఉందని........

Published : 22 May 2022 01:52 IST

ప్రజా గొంతుకను అణచివేస్తోందంటూ కేంద్రంపై మండిపాటు

దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ తరహా పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్​లోని ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజల మేలు కోసం ఉందని.. దానికి నష్టం వాటిల్లితే అది భూగ్రహానికే సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్‌ ఇండియా.. లండన్‌లో నిర్వహించిన ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ అనే ముఖాముఖి సదస్సులో రాహుల్‌ పాల్గొని మాట్లాడారు. భారత్‌లో రెండు భిన్నమైన సిద్ధాంతాలు కొనసాగుతున్నాయన్న కాంగ్రెస్‌ నేత.. అభివృద్ధి ఫలాలు కొందరికే అందాలని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తుండగా, అందరికీ సమాన అవకాశాలు ఉండాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం చేస్తోందన్నారు.

తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాహుల్‌ తప్పుపట్టారు. ఎల్​ఏసీ వద్ద భారత్‌-చైనా ఘర్షణలను ఉక్రెయిన్‌-రష్యా విభేదాలతో పోల్చారు. ప్రాదేశిక సమగ్రతను రష్యా గుర్తించడం లేదని, అమెరికాతో స్నేహం పట్ల కోపంతో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోందని పేర్కొన్నారు. చైనా కూడా భారత్‌ పట్ల ఈ రెండు అంశాల ఆధారంగానే గొడవకు దిగుతోందని వ్యాఖ్యానించారు. చైనా వ్యవహారంలో కేంద్రం వైఖరిని రాహుల్‌ తప్పుబడుతూ.. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై చర్చించడానికి అనుమతించకుండా, దీనిపై మాట్లాడే వారి గొంతు నొక్కుతోందని విమర్శించారు.

‘ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతను అంగీకరించబోమని రష్యా ఆ దేశంతో వాదిస్తోంది. నాటో, అమెరికాలతో సంబంధాలను తెంచుకునేలా చేసేందుకు దాడి చేస్తున్నాం అని పేర్కొంటోంది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న దానికి.. లద్దాఖ్‌, డోక్లాంలో జరుగుతున్న దానికి పోలికలను గమనించాలి. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను గుర్తించబోమని చైనా పేర్కొంటోంది. అమెరికాతో భారత్‌ స్నేహాన్ని అంగీకరించబోమని వ్యాఖ్యానిస్తోంది. దీనిపై చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడమే సమస్య. భారత్‌లో చైనా దళాలు తిష్ఠ వేశాయి. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సుపై చైనా పెద్ద వంతెనను నిర్మిస్తోంది. అక్కడ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. కాని దీనిపై కేంద్ర ప్రభుత్వం మాట్లాడకూడదని భావిస్తోంది. దీనిపై చర్చను అణచివేయాలని చూస్తోంది’ అని కాంగ్రెస్‌ అగ్రనేత అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని