మోదీజీ.. మేం చెప్పేది కూడా వింటే బాగుంటుంది!

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ గురువారం ఆరా తీశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి మార్గనిర్దేశం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఝార్ఖండ్‌ సీఎంలతో మోదీ మాట్లాడారు.....

Updated : 07 May 2021 15:19 IST

ప్రధాని ఫోన్‌ సంభాషణపై ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ గురువారం ఆరా తీశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి మార్గనిర్దేశం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఝార్ఖండ్‌ సీఎంలతో మోదీ మాట్లాడారు. అయితే, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రధాని మాట్లాడిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ కేవలం ఆయన మనసులో ఉన్న మాటల్ని మాత్రమే బయటపెట్టారని.. తాము చెప్పే అంశాలను కూడా విని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

‘‘ఈరోజు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆయన కేవలం తన మనసులోని మాటను బయటపెట్టారు. చేయాల్సిన పనులతో పాటు మేం చెప్పే అంశాలు కూడా విని ఉంటే బాగుండేది’’ అని సోరెన్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు. దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో ఝార్ఖండ్‌ ఒకటి. గురువారం రాష్ట్రంలో 133 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,479కి పెరిగింది.

సోరెన్‌ వ్యాఖ్యలపై భాజపా వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ‘‘హేమంత్‌ సోరెన్‌ ఓ విఫల ముఖ్యమంత్రి. పాలనలో వైఫల్యం చెందారు. ప్రజలకు సాయం చేయడంలోనూ విఫలమయ్యారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తన కార్యాలయానికి ఉన్న హుందాతనాన్ని తగ్గిస్తున్నారు. సమయం గడిచిపోతోంది. సోరెన్‌ ఇప్పటికైనా మేల్కొని పనికి ఉపక్రమించాలి’’ అని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాబూలాల్‌ మరాండీ ట్విటర్‌ వేదికగా విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని