పబ్జీ గేమ్ ఆ కోవకు చెందినదే: జావడేకర్

కొన్ని మొబైల్ గేమ్స్ హింసాత్మకంగా ఉండటంతో పాటు, యూజర్లను వ్యసనపరులుగా మార్చుతున్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు.

Published : 03 Mar 2021 01:24 IST

దిల్లీ: కొన్ని మొబైల్ గేమ్స్ హింసాత్మకంగా ఉండటంతో పాటు, యూజర్లను వ్యసనపరులుగా మార్చుతున్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. పబ్జీ గేమ్ ఆ కోవకు చెందినదేనని వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతి, విలువలను ప్రోత్సహించేలా గేమింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దాని కింద వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, యానిమేషన్‌కు సంబంధించి కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. ఓ వర్చువల్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి విషయాలను వెల్లడించారు. 

‘ఐఐటీ ముంబయి సహకారంతో కేంద్ర సమాచార, ప్రసార శాఖ  గేమింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2021లో కొత్త సెషన్‌ ప్రారంభంతో దీన్ని అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నాం. భారతీయ సంస్కృతి, విలువల పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ మక్కువ చూపుతున్నారు. చిన్నారులు, యువతలో వాటి గురించి అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ విలువలను పరిచయం చేయవచ్చు. మొబైల్స్‌, ఇతర గాడ్జెట్లలో అందుబాటులో ఉన్న చాలా గేమ్స్ హింసాత్మకంగా ఉంటున్నాయి. యూజర్లను వ్యవసపరులుగా మారుస్తున్నాయి. ఇవి చిన్నారుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పబ్జీ వాటిలో ఒకటి. అయితే వాటిని విమర్శించి ప్రయోజనం లేదు. మేక్‌ఇన్‌ఇండియా కింద మన సొంత గేమ్స్‌, యాప్స్‌ను తయారుచేసుకోవాలి’ అని జావడేకర్ వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని