వాతావరణ మార్పులపై నాసా, ఇస్రో సంయుక్త పరిశోధన

తౌక్టే తుపాను గండం గడచి పదిరోజులు కాకముందే మరో తుపానును ఎదుర్కొంటున్న భారత్‌కు ఇది పెనుసవాలే. ఇలాంటి అనేక విపత్తులను ఎదుర్కోవడంలో ప్రపంచం మొత్తం పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

Published : 25 May 2021 23:17 IST

విపత్తు నిర్వహణలో కీలకం కానున్న నూతన వ్యవస్థ

దిల్లీ: తౌక్టే తుపాను గండం గడచి పదిరోజులు కాకముందే మరో తుపానును ఎదుర్కొంటున్న భారత్‌కు ఇది పెనుసవాలే. ఇలాంటి అనేక విపత్తులను ఎదుర్కోవడంలో ప్రపంచం మొత్తం పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న తుపానులు, అడవులు కార్చిచ్చుల బారిన పడటం వంటి వాటిని ఎదుర్కోవడం విపత్తు ప్రతిస్పందన నిర్వహణలో కీలకంగా మారింది. ఈ విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా), ఇండియన్‌ స్పేస్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) కలిసి సంయుక్తంగా ఒక కొత్త వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. వాతావరణ మార్పులు, విపత్తు నష్టాలను తగ్గించేందుకు సంబంధించిన వాటిలో ఈ వ్యవస్థ కీలకంగా మారుతుందని నాసా వెల్లడించింది. ఎర్త్‌ సిస్టం అబ్జర్వేటరీలో భాగంగా ఉపగ్రహాలతో కలిసి ప్రత్యేకంగా పనిచేసేందుకు, భూమిని సమగ్రంగా పరిశీలించేందుకు దీనిని రూపొందిస్తున్నామన్నారు. 2017లో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ చేసిన ఎర్త్‌ సైన్స్‌ సర్వే సిఫార్సుల ఆధారంగా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు నాసా ఒక ప్రకటనలో తెలిపింది.

ఇస్రో నుంచి రాడార్‌లు..

ఈ అబ్జర్వేటరీకి ఇస్రో రెండు రాడార్‌లను అందించనుంది. భూ ఉపరితలంలో మార్పులను కొలిచేందుకు వీటిని వినియోగిస్తారు. వీటిలో ఒక దానికి నాసా-ఇస్రో సింథటిక్‌ ఎపర్చర్‌ రాడార్‌ (నిసాన్‌)గా  పేరు పెట్టారు. ఈ వ్యవస్థను రూపొందించడం ద్వారా భూమిపై హిమపాతాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం, కొండచరియలు జారిపడటం, భూగర్భ జలాల పరిమాణం, హిమానీ నదాలు, భూమి లోపలి అంశాలు, సముద్రమట్టం వంటి ప్రతి వాటిని విశ్లేషించి వాటి ద్వారా ఏర్పడే సహజ ప్రమాదాలను ముందుగానే గుర్తించొచ్చని నాసా పేర్కొంది. భూమిపై ఉండే అన్ని అంశాలను ఈ వ్యవస్థ విశ్లేషించి రాబోయే ఉపద్రవాల గురించి ముందుగానే సమాచారం ఇస్తుందని వారు పేర్కొన్నారు. సహజ మానవ వనరులను ప్రభావితం చేసే వాతావరణ మార్పులను విశ్లేషించేందుకు ఈ అబ్జర్వేటరీ డేటాను శాస్త్రవేత్తలు ఉపయోగిస్తారని నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని