PM Modi: ఆధ్యాత్మిక కేంద్రాలు స్టార్టప్‌లకు స్ఫూర్తినివ్వాలి.. ప్రధాని మోదీ పిలుపు

దేశంలోని స్టార్టప్‌లు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఇక్కడి ఆధ్యాత్మిక నిలయాలు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 80వ...

Published : 22 May 2022 15:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని స్టార్టప్‌లు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఇక్కడి ఆధ్యాత్మిక నిలయాలు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆదివారం ప్రధాని ఆన్‌లైన్‌ వేదికగా తన సందేశం అందజేశారు. అందరి కోసం పాటుపడాలంటూ మన సాధువులు ఎల్లప్పుడూ ప్రజల్లో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. గణపతి సచ్చిదానంద స్వామి జీవితం సైతం సమాజ సేవ, దానధర్మాలతో నిండి ఉందని.. అనేక ఆశ్రమాలు, పెద్ద సంస్థ, వివిధ ప్రాజెక్టుల రూపంలో ఇది కనిపిస్తుందని కొనియాడారు.

‘ప్రస్తుతం ప్రపంచం మన స్టార్టప్‌లను భవిష్యత్తుగా చూస్తోంది. 'మేక్ ఇన్ ఇండియా'.. ప్రపంచ అభివృద్ధికి ఆశాకిరణంగా మారుతోంది. ఈ క్రమంలోనే మన ఆధ్యాత్మిక కేంద్రాలు.. స్టార్టప్‌లకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాన’ని ప్రధాని అన్నారు. దేశాభివృద్ధి కోసం ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ అనే మంత్రంతో సమిష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. ‘దేశ అమృతోత్సవాల సందర్భంలో స్వామి 80వ జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నాం. స్వార్థానికి తావులేకుండా ప్రజాసేవకు అంకితం కావాలని మన ఆధ్యాత్మికవేత్తలు మనలో ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తారు’ అని అన్నారు. మరో నెల రోజుల్లో రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ.. యోగా, యువత.. ఈ రెండు నేడు భారత్‌కు గుర్తింపుగా మారాయని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని