కొవిడ్‌ సూపర్‌ స్ప్రెడర్స్‌ అవే: ఎన్‌టీఏజీ

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విలయతాండవం చేస్తోంది. మునుపటి కంటే వేగంగా వృద్ధి చెందుతూ జనాల్లో భయ ప్రకంపనలు రేపుతోంది. బుధవారం ఒక్కరోజే దేశంలో అత్యధికంగా 1.84 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ..

Updated : 15 Apr 2021 05:13 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విలయతాండవం చేస్తోంది. మునుపటి కంటే వేగంగా వృద్ధి చెందుతూ జనాల్లో భయ ప్రకంపనలు రేపుతోంది. బుధవారం ఒక్కరోజే దేశంలో అత్యధికంగా 1.84 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఇంతటి స్థాయిలో వైరస్‌ ఉగ్రరూపం దాల్చడంపై ఎన్‌టీఏజీఐ (జాతీయ ఇమ్యునేజేషన్‌ సాంకేతిక సలహా బృందం) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే ఆరోడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు, మతపరమైన సామూహిక కార్యక్రమాలు, రైతుల ఆందోళన వంటివి మహమ్మారి ఉద్ధృతికి సూపర్‌ స్ప్రెడర్స్‌ అని పేర్కొన్నారు.  ఏ చిన్న, పెద్ద సామూహిక కార్యక్రమమైనా వైరస్‌ వ్యాప్తికి సూపర్‌ స్ప్రెడరేనని తేల్చిచెప్పారు. బుధవారం ఓ వార్త సంస్థతో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ ఉద్ధృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. 

మరోవైపు కొవిడ్‌ వ్యాప్తిని పట్టించుకోకుండా కొంతమంది యువత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గ్రూపులు కడుతూ పార్టీలు చేసుకుంటున్నారని తెలిపారు. బహిరంగ సమావేశాలతో సహా వీటన్నింటిని ఆపకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా మరే అవకాశం లేకపోలేదన్నారు. కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలు విధించుకోవచ్చని, అయితే దేశ వ్యాప్త లాక్‌డౌన్‌కు మాత్రం తాను అనుకూలం కాదని చెప్పారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో విధించిన 15 రోజుల పాక్షిక లాక్‌డౌన్‌ను ఆయన ఉదాహరణగా వివరించారు. కాగా, దేశంలో బుధవారం ఒక్కరోజు 1,84,372 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కొవిడ్‌ సోకిన వారి సంఖ్య 1,38,73,825కి చేరింది. ఇప్పటి వరకు 1,23,36,036 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. 1,72,085 మంది కరోనాతో మృత్యుఒడికి చేరారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని