Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌! 

శంలో కల్లోలం రేపిన కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ఈ రోజు దేశవ్యాప్తంగా లక్ష కన్నాతక్కువ కేసులే నమోదయ్యాయి. కొత్త కేసులు తగ్గి రికవరీలు.......

Updated : 08 Jun 2021 20:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కల్లోలం రేపిన కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ఈ రోజు దేశవ్యాప్తంగా లక్ష కన్నాతక్కువ కేసులే నమోదయ్యాయి. కొత్త కేసులు తగ్గి రికవరీలు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనల్ని సడలిస్తున్నాయి. థర్డ్‌వేవ్‌లో ఈ వైరస్‌ ముప్పు చిన్నారులకు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. కరోనా కష్టకాలంలో ఊరటనిచ్చే కొన్ని వార్తలు మీకోసం.. 

👍 దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుతోంది. రోజువారీ కేసులు 63రోజుల కనిష్ఠానికి చేరాయి. సోమవారం 18.7లక్షల మందికి పైగా టెస్ట్‌ చేయగా.. 86వేల కేసులు వచ్చాయి.  అలాగే, ఒక్కరోజే 33.6లక్షల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. ఏప్రిల్‌ 3 తర్వాత అత్యల్పంగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. 322 జిల్లాల్లో నెల నుంచి కేసులు తగ్గుదల కనబడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో రికవరీ రేటు 94.3శాతం గా ఉంది. 15 రాష్ట్రాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతం కంటే దిగువనే ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 4.62శాతంగా ఉంది. కేసుల్లో గత వారం 33శాతం క్షీణత కనిపించింది. 209 జిల్లాల్లో 100 చొప్పున రోజువారీ కేసులు నమోదవుతున్నట్టు కేంద్రం తెలిపింది.

👍 థర్డ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ ప్రభావం చిన్నారులపై అధికంగా ఉంటుందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాల్లేవని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ సోకిన పిల్లల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. మున్ముందు కరోనా తీవ్రత చిన్నారులపై అధికంగా ఉంటుందని తాము భావించడం లేదన్నారు.

👍 కరోనా రోగులు త్వరగా కోలుకొనేందుకు తాము రూపొందించిన 2-డీజీ ఔషధం ఉపయుక్తంగా ఉంటుందని డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీశ్‌ రెడ్డి అన్నారు.  మధ్యస్థ, తీవ్ర లక్షణాలు ఉన్న రోగులకే ఇది వాడాలని, తద్వారా ఆక్సిజన్‌ అవసరం బాగా తగ్గుతుందన్నారు. జులై చివరి నాటికి 850 ఆక్సిజన్‌ ప్లాంట్లు నిర్మిస్తామని చెప్పారు. డీఆర్‌డీవో రూపొందించిన 2డీజీ ఔషధంపై ఎఫ్‌టీసీసీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. 

👍 దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రకటించిన కేంద్రం భారీగా టీకాల తయారీ కోసం ఆర్డర్లు ఇచ్చింది. మొత్తం 44 కోట్ల డోసుల తయారీ కోసం (కొవిషీల్డ్‌ 25కోట్లు; కొవాగ్జిన్‌ 19కోట్ల డోసులు) ఆర్డర్లు ఇచ్చినట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్‌ మంగళవారం వెల్లడించారు. ఇప్పటికే బయోలాజికల్‌-ఇ సంస్థకు 30 కోట్ల డోసులకు కేంద్రం ఆర్డర్‌ చేసిన విషయం తెలిసిందే.

👍 తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,33,134 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,897 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా 15 మంది మరణించినట్టు రాష్ట్ర వైద్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. 

👍 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 1.19కోట్ల టీకా డోసులు పంపిణీకి సిద్ధంగా అందుబాటులో ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 24కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేయగా.. వీటిలో 23.47కోట్ల డోసులు వినియోగం (వృథాతో కలిపి) జరిగినట్టు తెలిపింది. ప్రస్తుతం 1,19,46,925 డోసులు రాష్ట్రాల వద్ద ఉన్నట్టు వెల్లడించింది. 

👍 కరోనా కష్టకాలంలో అవస్థలు పడుతున్న వీధి వ్యాపారుల కోసం ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కరోనా సహాయ ప్యాకేజీని ప్రకటించారు. రూ.26కోట్లతో ప్రకటించిన ఈ ప్యాకేజీతో 87,657మంది వీధివ్యాపారులు లబ్ధి పొందనున్నారు.

👍 థర్డ్‌ వేవ్‌ చిన్నారులకు ఎక్కువ ముప్పు ఉందంటూ హెచ్చరికల  నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల లోపు వయసు కలిగిన పిల్లలు ఉన్న తల్లులను గుర్తించి వారికి ప్రాధాన్య క్రమంలో టీకా వేయించాలని నిర్ణయించింది. అర్హులైనవారి జాబితాను గ్రామాల వారీగా తయారు చేయాలని అధికారులను వైద్యశాఖ ఆదేశించింది. లబ్దిదారులను ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు లబ్ధిదారులను గుర్తించి ఆయా వ్యాక్సిన్‌ కేంద్రాల వద్దకు తీసుకురావాలని సూచించింది. 

👍 కరోనా నివారణకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, జమ్మూకశ్మీర్‌లోని ఓ కుగ్రామంలో ప్రతిఒక్కరూ టీకా వేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు. బందిపొరాలోని వేయాన్‌ గ్రామం దేశంలోనే 18 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా వేసుకున్న తొలి గ్రామంగా నిలిచింది. ఈ గ్రామంలో 18 ఏళ్లు దాటిన వారు 362మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

👍 మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి కొవిడ్‌ కర్ఫ్యూని పొడిగించింది. ఈ నెల 15వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పష్టంచేశారు.  మరోవైపు, యూపీలోని అన్ని జిల్లాల్లో కొవిడ్‌ కర్ఫ్యూని ఎత్తివేశారు. అయితే, రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు నైట్‌ కర్ఫ్యూమాత్రం కొనసాగుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కార్యాలయం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు