US: రోబోలతో ఫుడ్‌ డెలివరీ.. ఆర్డర్‌ చేస్తే నిమిషాల్లోనే ఇంటికి!

అమెరికాకు చెందిన ఓ సంస్థ తొలిసారి రోబోల సాయంతో ఫుడ్‌ డెలివరీ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో......

Published : 02 Nov 2021 17:43 IST

శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో రోబోల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి వీటి అవసరం మరింత పెరిగింది. మనుషులే కరోనాకు వాహకాలుగా మారిన తరుణంలో ప్రతి రంగానికి రోబో సేవలు కీలకంగా మారాయి. అయితే ఇప్పటివరకు ఆహారాన్ని వాహనాలు, డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తుండగా.. అమెరికాకు చెందిన ఓ సంస్థ తొలిసారి రోబోల సాయంతో వాటిని చేరవేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో.. ఫుడ్‌ డెలివరీ సైతం వ్యక్తుల ప్రమేయం లేకుండా సరఫరా చేసేందుకు ‘స్టార్‌షిప్‌ టెక్నాలజీస్‌’ అనే సంస్థ సరికొత్త రోబోను తయారు చేసింది.

ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ దేశాల్లోని కాలేజీ క్యాంపస్‌లలో ఈ రోబోలు సేవలందిస్తున్నాయి. మోకాళ్ల ఎత్తున్న చిన్నపాటి ఈ రోబోలు.. నాలుగు పెద్దసైజు పిజ్జాలను సైతం మోసుకెళ్లేలా వీటిని రూపొందించారు. గంటకు 5 మైళ్ల వేగంతో గమ్యస్థానాలకు ఆహారాన్ని చేరవేసేలా ఈ రోబోలను తయారుచేశారు. వీటికి అమర్చిన కెమెరాలు, సెన్సార్లు, జీపీఎస్‌, లేజర్‌ స్కానర్ల సాయంతో ఇవి స్వయంగా ముందుకు కదులుతాయి. కెమెరాల సాయంతో ఎదురున్న అడ్డంకులను అధిగమించటం సహా జీపీఎస్​ సాయంతో నిర్దేశించిన గమ్యస్థానానికి నిమిషాల్లోనే ఈ రోబోలు చేరుకుంటున్నాయి.

కోడ్‌ను టైప్‌ చేస్తేనే తెరుచుకుంటుంది

రోబో గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత వినియోగదారుడు అందులో ఉండే ఆహారాన్ని పొందాలంటే ఆయనకు ఇచ్చిన ఓ కోడ్‌ను టైప్‌ చేయాల్సి ఉంటుంది. తన మొబైల్‌ ఫోన్‌లో కోడ్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసిన తరువాత రోబోకున్న డోర్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. అప్పుడు మాత్రమే కస్టమర్‌ ఆ ఆహారాన్ని తీసుకునేందుకు వీలు పడుతుంది. రోబో సేవలను పలు క్యాంపస్‌లకు చెందిన విద్యార్థులు మెచ్చుకుంటున్నారు. ఈ తరహా సేవలు అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడుతున్నారు.

రెండేళ్ల క్రితమే..

2019లోనే ఫుడ్‌ డెలివరీ రోబోలను స్టార్‌షిప్‌ టెక్నాలజీస్‌ అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆ సంస్థ సీఈఓ అలాస్టైర్‌ వెస్ట్‌గర్త్‌ వెల్లడించారు. కరోనా విజృంభణ అనంతరం వీటి డిమాండ్‌ బాగా పెరగడంతో ప్రారంభంలో 250గా ఉన్న రోబోల సంఖ్యను ప్రస్తుతం 1000కి పైగా పెంచినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలోని 20 క్యాంపస్‌లలో ఫుడ్‌ డెలివరీ రోబోలు పనిచేస్తుండగా.. త్వరలో మరో 25 క్యాంపస్‌లలో వీటి సేవలు అందుబాటులోకి రానున్నాయని సీఈఓ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని