జంతువులకూ కరోనా వ్యాక్సిన్‌!

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మానవుల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయగా, ప్రస్తుతం జంతువులకూ వ్యాక్సిన్ తీసుకువస్తున్నట్లు రష్యా వెల్లడించింది.

Published : 31 Mar 2021 18:34 IST

అభివృద్ధి చేసిన రష్యా, తొలిసారి రిజిస్టర్‌ చేసుకున్నట్లు వెల్లడి

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మానవుల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయగా, ప్రస్తుతం జంతువులకూ వ్యాక్సిన్ తీసుకువస్తున్నట్లు రష్యా వెల్లడించింది. ఇప్పటికే వాటిపై పరిశోధనలు పూర్తిచేసిన రష్యా, వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసుకున్నట్లు తెలిపింది. జంతువుల కోసం కరోనా వ్యాక్సిన్‌ను తీసుకురావడం ప్రపంచంలో తొలిసారి కావడం విశేషం.

కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు కరోనా వైరస్‌ సోకుతున్నట్లు కొన్ని దేశాల్లో ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటికీ వ్యాక్సిన్‌ తీసుకొచ్చేందుకు కొంతకాలం క్రితమే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా జంతువులకు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసిన రష్యా, తాజాగా ప్రయోగాలు పూర్తి చేసుకున్నట్లు వెల్లడించింది. ‘కార్నివాక్‌-కొవ్‌’ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను రష్యా జాతీయ జంతువుల ఆరోగ్య విభాగం రూపొందించినట్లు అక్కడి నియంత్రణ సంస్థ పేర్కొంది. ప్రయోగాల్లో మంచి ఫలితాలు రావడంతో వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రయోగాల్లో భాగంగా జంతువుల్లో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని టీకా అభివృద్ధి చేసిన రష్యా ఆరోగ్యశాఖ విభాగం ప్రకటించింది.

కుక్కలు, పిల్లులు, నక్కలతో పాటు ఇతర జంతువులపై గతేడాది నుంచే వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ మొదలు పెట్టామని రష్యా జంతువుల సంరక్షణ విభాగం వెల్లడించింది. తాజాగా వెల్లడైన ప్రయోగ ఫలితాల ప్రకారం, ఈ వ్యాక్సిన్‌తో జంతువుల్లో యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడైంది. అంతేకాకుండా వ్యాక్సిన్‌ వల్ల జంతువులకు ఎటువంటి హాని కలుగడం లేదని తేలడంతో త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్‌ నుంచి ‘కార్నివాక్‌-కొవ్‌’ వ్యాక్సిన్‌ను పెద్దఎత్తున ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామని.. ఆస్ట్రేలియా, గ్రీస్‌, పోలాండ్‌, కెనడా, అమెరికాతో పాటు సింగపూర్‌కు చెందిన పలు సంస్థలు ఈ వ్యాక్సిన్‌ను కొనేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని