Supreme Court: ‘అలాంటి వార్తలు దేశానికి చెడ్డపేరు తెస్తున్నాయి..’

సోషల్‌మీడియా, వెబ్‌ పోర్టళ్లలో నకిలీ, తప్పుడు వార్తల ప్రచారంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొన్ని మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని మత కోణంలోనే చూపుతున్నారని,

Updated : 23 Feb 2024 19:56 IST

సోషల్‌మీడియాలో నకిలీ వార్తల ప్రచారంపై సుప్రీం అసహనం

దిల్లీ: సోషల్‌మీడియా, వెబ్‌ పోర్టళ్లలో నకిలీ, తప్పుడు వార్తల ప్రచారంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొన్ని మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని మత కోణంలోనే చూపుతున్నారని, దీని వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందని విచారించింది. సామాజిక మాధ్యమ సంస్థలు కేవలం బలవంతులకే స్పందిస్తున్నాయని, సామాన్యుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

తబ్లీగి జమాత్‌ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సోషల్‌మీడియా, వెబ్‌ పోర్టళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘దేశంలో ప్రతి విషయాన్ని మత కోణంలో చూపుతున్నారు. ఇది దేశంపై దుష్ప్రభావం చూపుతోంది. సోషల్‌మీడియా, వెబ్‌ పోర్టళ్లలో కంటెంట్‌ విషయంలో జవాబుదారీతనం కన్పించట్లేదు. వీటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. సామాజిక మాధ్యమాలు దేన్నయినా ప్రచురించగలుగుతున్నాయి. ఎవరైనా యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించే అవకాశం ఉంది. నియంత్రణ వ్యవస్థ లేక వ్యక్తుల పరువుకు నష్టం జరుగుతోంది. వ్యవస్థలు, న్యాయమూర్తులను కూడా చెడుగా చూపిస్తున్నారు’’ అని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అసహనం వ్యక్తం చేశారు.

సోషల్‌మీడియా సంస్థలు కేవలం బలవంతుల మాటలనే వింటున్నాయని, ఎలాంటి జవాబుదారీతనం లేకుండా వ్యవస్థలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేస్తున్నాయని జస్టిస్‌ రమణ ఆగ్రహించారు. సామాజిక మాధ్యమ వేదికలు సామాన్యులకే కాదు.. న్యాయమూర్తులకు కూడా స్పందించట్లేదని అన్నారు. ఈ పరిణామాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐటీ నిబంధనలపై అన్ని హైకోర్టుల్లో దాఖలపై పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. వీటిపై ఆరు వారాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని