
జర్నలిస్ట్ అరెస్ట్: యూపీకి సుప్రీం నోటీసులు!
దిల్లీ: కేరళ జర్నలిస్టు అరెస్టు వ్యవహారంలో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టు సిద్ధిఖ్ కప్పన్కు బెయిల్ మంజూరు చేయాలంటూ కేరళ జర్నలిస్టు యూనియన్ వేసిన పిటిషన్పై సీజేఐ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం తమ ప్రతిస్పందన తెలియజేయాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. అరెస్టయిన జర్నలిస్టు తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ద్వారా కప్పన్కు అత్యవసరంగా మధ్యంతర బెయిల్ ఇప్పించాలని కపిల్ ధర్మాసనాన్ని కోరారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం మేం ఈ పిటిషన్ను విచారించేందుకు నిరాకరిస్తున్నాం. అయినా ఈ కేసులో మీరు అలహాబాద్ హైకోర్టుకు ఎందుకు వెళ్లకూడదు?’ అని ప్రశ్నించారు. అనంతరం ఈ కేసును నవంబర్ 20, శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఆదేశించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ కేసును కవర్ చేసేందుకు వెళ్లిన కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్ధిఖ్ కప్పన్ను యూపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. దీంతో ‘కప్పన్ ఎందుకు అరెస్టు చేశారు.. ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ’ కేరళ జర్నలిస్టు సంఘం(కేయూడబ్ల్యూజే) సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది.