Corona: కరోనా క్లస్టర్‌గా థానె వృద్ధాశ్రమం.. 67 మందికి పాజిటివ్‌

దేశవ్యాప్తంగా కరోనావైరస్ కట్టడిలోనే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాలు హఠాత్తుగా కొవిడ్ క్లస్టర్లుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పలు కళాశాలల్లో జరిగిన వేడుకలు.. సూపర్‌ స్ప్రెడర్‌ ఘటనలుగా మారడంతో విద్యార్థుల్లో భారీగా కేసులు వెలుగుచూశాయి.

Updated : 29 Nov 2021 17:04 IST

ముంబయి: దేశవ్యాప్తంగా కరోనావైరస్ కట్టడిలోనే ఉన్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాలు హఠాత్తుగా కొవిడ్ క్లస్టర్లుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పలు కళాశాలల్లో జరిగిన వేడుకలు.. సూపర్‌ స్ప్రెడర్‌ ఘటనలుగా మారడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా మహారాష్ట్రలోని థానెకు చెందిన వృద్ధాశ్రమం కూడా ఆ పరిస్థితిలోనే ఉంది. అందులోని 67 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడం కలవరం పుట్టిస్తోంది.

భివండీ నగరంలోని సార్గావ్ ప్రాంతానికి చెందిన మాతోశ్రీ వృద్ధాశ్రమంలో ఇటీవల కొందరిలో కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు.. అక్కడికి వైద్యుల్ని పంపి పరీక్షలు చేయించారు. ఆ ఆశ్రమంలోని 109 మందిని శనివారం పరీక్షించగా.. 67 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిలో 62 మంది వృద్ధులు కాగా.. ఐదుగురు వృద్ధాశ్రమంలో పనిచేసే సిబ్బంది. 41 మంది ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారని, 30 మందిలో ఏ లక్షణాలు కనిపించలేదని.. బాధితుల్ని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనీశ్ రెంగే వెల్లడించారు. అలాగే 15 నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు తెలిపారు.

ఈ ఘటనతో వెయ్యికి పైగా జనాభా ఉన్న సార్గావ్‌ ప్రాంతాన్ని ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించింది. అలాగే స్థానికులందరికీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కొద్దినెలలుగా థానెలో ఒకే ప్రాంతంలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూడటం ఇదే మొదటిసారి.

కరోనా అదుపులోనే ఉందని ఊరట చెందుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆ దేశం నుంచి థానెకు చేరుకున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే అది ఏ వేరియంటో తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తి నమూనాల్ని అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. అతడిని వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్‌లో ఉంచారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని