Vaccine certificate: భారత వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌కు 96 దేశాలు ఆమోదం!

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి ఇచ్చే సర్టిఫికెట్‌ను గుర్తించేందుకు 96 దేశాలు భారత్‌తో పరస్పర అంగీకారం తెలిపాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 09 Nov 2021 21:52 IST

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి ఇచ్చే సర్టిఫికెట్‌ను గుర్తించేందుకు భారత్‌తో 96 దేశాలు పరస్పర అంగీకారం తెలిపాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మిగతా దేశాల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉందని పేర్కొంది. దీంతో విద్య, వ్యాపారం, పర్యటన కోసం విదేశీ రాకపోకలను సాగించే వారికి ఇక ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడింది.

‘టీకా ధ్రువపత్రాలను (Vaccine Certificate) గుర్తించేందుకు భారత్‌తో ప్రస్తుతం 96 దేశాలు పరస్పరం అంగీకరించాయి. కొవిషీల్డ్‌ / ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపిన / దేశీయంగా ఆనుమతి పొందిన కొవిడ్‌ వ్యాక్సిన్లను తీసుకున్న వారి సర్టిఫికెట్‌ ధ్రువీకరణకు ఎలాంటి ఆటంకం ఉండదు’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. దీంతో ఆయా దేశాల నుంచి భారత్‌ వచ్చే ప్రయాణికులకు కూడా కొంత సడలింపులు లభిస్తాయన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాలపై అక్టోబర్‌ 20న కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో ఆయా దేశాల నుంచి వచ్చే వారికి వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఇక భారత్‌ నుంచి విదేశాలను ప్రయాణించే వారు కూడా కొవిన్‌ పోర్టల్‌ నుంచి వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌కు భారత్‌తో పరస్పరం అంగీకారం తెలిపిన దేశాల్లో  కెనడా, అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, బెల్జియం, ఐర్లాండ్‌, నెదర్లాండ్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌, స్వీడెన్‌, బ్రెజిల్‌, రష్యా, కువైట్‌, ఒమన్‌, యూఏఈ, బహ్రెయిన్‌, కతర్‌, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్‌తోపాటు మొత్తం 96 దేశాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రి వెల్లడించారు. వీటికితోడు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ పరస్పర గుర్తింపు కోసం మిగతా దేశాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగా సాగుతోందన్న ఆయన.. ఇప్పటి వరకు 109 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని