US: అమెరికా విమానాశ్రయాలు కిటకిట

అమెరికాలో విమానాశ్రయాలు కిటకిటలాడుతున్నాయి. దేశీయ ప్రయాణాలు, విహార యాత్రలు పెరగడమే ఇందుకు కారణం. కరోనా ప్రభావం అనంతరం ఎప్పుడూ లేనంత రద్దీ గత వారాంతంలో కనిపించింది.

Updated : 20 Jul 2021 07:25 IST

పెరిగిన దేశీయ ప్రయాణాలు 

అయినా పడిపోతున్న ఎయిర్‌లైన్స్‌ షేర్లు

వాషింగ్టన్‌: అమెరికాలో విమానాశ్రయాలు కిటకిటలాడుతున్నాయి. దేశీయ ప్రయాణాలు, విహార యాత్రలు పెరగడమే ఇందుకు కారణం. కరోనా ప్రభావం అనంతరం ఎప్పుడూ లేనంత రద్దీ గత వారాంతంలో కనిపించింది. ఆదివారం అన్ని విమానాశ్రయాల్లో 22 లక్షల మందికి పైగా ప్రయాణికుల స్క్రీనింగ్‌ జరిగిందని అమెరికా రవాణా భద్రతా విభాగం తెలిపింది. గత ఏడాది మార్చి తర్వాత ఇదే అత్యధికమని చెప్పింది. అయితే 2019 నాటికి ఇదే సమయానికి ఉన్న రద్దీతో పోలిస్తే 18% తక్కువేనని పేర్కొంది. 

అమెరికాలో దాదాపు ఏడాది తర్వాత విమానయానం కళకళలాడుతున్నా.. ఆ రంగంలోని పెట్టుబడిదారులు మాత్రం సంతోషంగా లేరు. సోమవారం దాదాపుగా అన్ని ఎయిర్‌లైన్స్‌, క్రూయిజ్‌, హోటల్‌ కంపెనీల షేర్లు పడిపోయాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ షేర్లు 6% పైగా కుంగగా, డెల్టా ఎయిర్‌లైన్స్‌ 5%, సౌత్‌వెస్ట్‌ 4% పైగా పతనమయ్యాయి. పలు క్రూయిజ్‌ లైన్స్‌, హోటళ్ల షేర్లు సైతం ఇదే బాట పట్టాయి. దేశీయంగా విమానయానం కరోనా మునుపటి స్థాయిలకు చేరినా, అంతర్జాతీయ ప్రయాణాలు 2019తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని.. ఈ ప్రభావం ఎయిర్‌లైన్స్‌ వ్యాపారంపై గణనీయంగా ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అమెరికా ఎయిర్‌లైన్స్‌ కంపెనీల ఆదాయంలో గణనీయమైన వాటా అంతర్జాతీయ రవాణా ద్వారానే వస్తుండటం గమనార్హం. అంతర్జాతీయ ప్రయాణాలపై నేటికీ ఆంక్షలు కొనసాగుతుండటం, అదే సమయంలో పలు దేశాలతో పాటు అమెరికాలోనూ మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఈ రంగాన్ని నిరుత్సాహపరుస్తోంది. అమెరికాలో నమోదయ్యే రోజువారీ కరోనా కేసులు కూడా గత రెండు వారాల్లో రెట్టింపయ్యాయి. అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే అగ్రరాజ్యంలో ఎయిర్‌లైన్స్‌ వ్యాపారం ఎంతో మెరుగైనట్టుగా కనిపిస్తోంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌ గత వారం రెండో త్రైమాసిక ఫలితాల్లో లాభాలు ప్రకటించింది. మిగతా పోటీ కంపెనీలూ ఇదే వారంలో ఫలితాలు ప్రకటించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు