Lakhimpur Kheri Case: కేంద్ర మంత్రి కుమారుడికి బెయిల్‌ నిరాకరణ..!

లఖింపుర్‌ ఖీరి ఘటనలో అరెస్టైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు కోర్టులో చుక్కెదురయ్యింది.

Published : 13 Oct 2021 20:31 IST

పోలీసు కస్టడీలోనే ఆశిష్‌ మిశ్రా

లఖ్‌నవూ: లఖింపుర్‌ ఖీరి ఘటనలో అరెస్టైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు కోర్టులో చుక్కెదురయ్యింది. బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ అందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆయనతో పాటు ఆ కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రాను అక్టోబర్‌ 9న యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ అరెస్టు చేసింది. అంతకుముందు దాదాపు 12గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిపినప్పటికీ ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని సిట్‌ పేర్కొంది. దీంతో అరెస్టైన ఆశిష్‌కు కోర్టు 14రోజుల కస్టడీ విధించింది. అయితే, మరింత విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరడంతో న్యాయస్థానం మరో మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం ఆశిష్‌ మిశ్రా పోలీసు కస్టడీలోనే ఉన్నారు. ముఖ్యంగా ఘటన జరిగిన సమయంలో ఆశిష్‌ మిశ్రా ఎక్కడ ఉన్నారనే అంశంపైనే పోలీసులు ఎక్కువ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆశిష్‌ అనుచరుడు అంకిత్‌ దాస్‌ను గంటపాటు పోలీసులు వేర్వేరుగా ప్రశ్నించారు. అయితే, ఘటన జరిగిన సమయంలో ఆశిష్‌ మిశ్రా అక్కడ లేరనే అంకిత్‌ దాస్‌ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో వీరిద్దరినే కాకుండా మరో నలుగురి అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు