Bulgaria: బల్గేరియాలో బస్సు దగ్ధం.. 45 మంది సజీవదహనం

బల్గేరియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురయ్యింది. దీంతో బస్సులో ప్రయాణిస్తోన్న వారిలో 45మంది ఆహుతయ్యారు.

Updated : 23 Nov 2021 15:06 IST

సోఫియా: బల్గేరియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురయ్యింది. దీంతో బస్సులో ప్రయాణిస్తోన్న వారిలో 45మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఏడుగురు ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

బల్గేరియా రాజధాని సోఫియా నుంచి పర్యాటకులతో బయలుదేరిన ఓ బస్సులో అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించడంతో అందులో ఉన్న 45మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. బస్సులో మృతదేహాలు ఓ కుప్పగా.. బూడిదగా మారాయని బల్గేరియా మంత్రి బోక్యో రష్కోవ్‌ పేర్కొన్నారు. ఇలాంటి భయానక ఘటనను ఇదివరకెన్నడూ చూడలేదన్న ఆయన.. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన అక్కడి పోలీసులు.. సాంకేతిక లోపంతో జరిగిందా? లేక డ్రైవర్‌ తప్పిదమా? అనే కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. ఈ దుర్ఘటనపై బల్గేరియా ప్రధానమంత్రి స్టీఫెన్‌ యానెవ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని