భారత విమానాలపై మరికొంతకాలం నిషేధం

భారత్‌లో డెల్టా రకం కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇక్కడి నుంచి నేరుగా వచ్చే ప్రయాణికుల విమానాలపై విధించిన నిషేధాన్ని కెనడా మరోసారి పొడగించింది. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో

Updated : 20 Jul 2021 17:34 IST

ఆంక్షలు పొడిగించిన కెనడా

ఒట్టావా: భారత్‌లో డెల్టా రకం కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇక్కడి నుంచి నేరుగా వచ్చే ప్రయాణికుల విమానాలపై విధించిన నిషేధాన్ని కెనడా మరోసారి పొడిగించింది. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి భారత్‌ విమానాలపై కెనడా ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాజ్ఞల గడువు జులై 21తో ముగియనుంది. అయితే భారత్‌లో కరోనా వ్యాప్తి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ డెల్టా వేరియంట్‌ ఆందోళనకరంగానే ఉండటంతో విమానాలపై నిషేధాన్ని మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

ఆగస్టు 21 వరకు భారత్‌ నుంచి నేరుగా ప్రయాణికుల విమానాలను అనుమతించబోమని ఆ దేశ రవాణా మంత్రి ఒమర్‌ అల్‌ఘబ్రా వెల్లడించారు. ‘‘కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ భారత్‌లో పరిస్థితులు ఇంకా తీవ్రంగానే ఉన్నాయి. అందుకే ప్రజారోగ్య సంస్థ సూచనల మేరకు భారత్‌ నుంచి విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తున్నాం. డెల్టా వేరియంట్‌ నుంచి మా దేశ ప్రజలను రక్షించేందుకు ఇదే ఉత్తమమైన మార్గం’’ అని ఒమర్‌ చెప్పుకొచ్చారు.

అయితే ‘థర్డ్‌ కంట్రీ’ ద్వారా భారత్‌ నుంచి ప్రయాణికులు తమ దేశానికి రావొచ్చని కెనడా తెలిపింది. ఇందుకోసం సదరు ప్రయాణికులు ఇంకో దేశంలో దిగి అక్కడ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రంతో కెనడాకు రావొచ్చని స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని