China Celebrity Missings: ఆట లేదు.. మాట లేదు.. మమ్మల్ని ధిక్కరిస్తే మాయమే..!

చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. అక్కడి అధికారులపై ఆరోపణలు చేసినా.. చైనా అధినాయకుడి ఆగ్రహానికి గురి కావాల్సిందే.

Updated : 22 Nov 2021 11:15 IST

చైనాలో పెరుగుతోన్న సెలబ్రిటీల మిస్టరీ మిస్సింగ్‌లు

బీజింగ్‌: చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. అక్కడి అధికారులపై ఆరోపణలు చేసినా.. చైనా అధినాయకుడి ఆగ్రహానికి గురి కావాల్సిందే. ఇలా అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని వినిపించే వారిని చైనా అణచివేస్తోందనే వాదనలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా అసమ్మతిని అణగదొక్కడంలో భాగంగా అలాంటివారి ఆచూకీ లేకుండా చేస్తుందనే ఆరోపణలూ ఉన్నాయి. ఇలా గత కొంతకాలంలో చైనాలో ప్రముఖుల మిస్సింగ్‌లు మిస్టరీగా మారుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి ఆచూకీ కనిపించకుండా పోవడంపైన ఇలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి. కేవలం పెంగ్‌ షువాయినే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన జాక్‌ మా వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు, అక్కడి కళాకారులు, సినీనటులు, ఉన్నతాధికారులు, మీడియా అధినేతలతోపాటు ఎంతో మంది ప్రముఖుల ఆచూకీ తెలియకుండా పోతున్నాయనే ప్రపంచ వ్యాప్తంగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాటిలో కొన్ని మిస్టరీ కేసులపై ఓసారి గమనిస్తే..

అయ్‌ వీవీ: కళాకారుడు

కళాకారుడు, చిత్ర నిర్మాతైన అయ్‌ వీవీ చైనా ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేస్తూ ఓ అసమ్మతివాదిగా ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా అక్కడి ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాల్లో ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తారు. దీంతో 2011లో ఆయనను అరెస్టు చేసిన ప్రభుత్వం.. దాదాపు 81రోజుల పాటు రహస్య ప్రదేశంలో నిర్బంధించింది. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల పాటు ఆయన పాస్‌పోర్టును నిలిపివేసింది. చైనాలో ఆచూకీ లేకుండా చేయడం ఎలా ఉంటుందో అని ప్రపంచానికి చాటిచెప్పిన అతికొద్ది మంది సెలబ్రిటీల్లో వీవీ ఒకరనే చెప్పవచ్చు. 2015లో చైనా నుంచి బయటకు వచ్చిన వీవీ.. అక్కడి జైలు జీవితాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. ముఖ్యంగా తినడం నుంచి నిద్రపోయేవరకు, స్నానం నుంచి మలవిసర్జన వరకూ ప్రతి నిమిషాన్ని అక్కడి గార్డులు ఎలా పర్యవేక్షించేవారో చెప్పుకొచ్చారు.

ఝావో వీ: నటి

పాశ్చాత్య సంప్రదాయం వల్లే తమ యువత పెడదారి పడుతోందని భావిస్తోన్న చైనా ప్రభుత్వం.. అక్కడి సెలబ్రిటీలపైనా కన్నేసింది. ముఖ్యంగా పాప్‌ కల్చర్‌ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల నుంచి అక్కడి యువతను దూరం చేస్తున్నట్లు ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆగస్టు నెలలో అక్కడి ప్రముఖ పాప్‌ సింగర్‌ ఝావో కనిపించకుండా పోయారు. ఆమెకు చెందిన సమాచారం కూడా ఇంటర్నెట్‌ నుంచి అదృశ్యమయ్యింది. వీటికితోడు ఆమె సినిమాలు, టీవీ షోలు కూడా ఆన్‌లైన్‌ వేదికల నుంచి తొలగించబడ్డాయి. ఆ సమయంలో ఆమె కనిపించకుండా పోవడం మరోసారి చర్చనీయాంశమయ్యింది. కానీ, నెల రోజుల తర్వాత ఆమె స్వగ్రామంలో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారా..? అనే విషయంపైనా స్పష్టత లేదు. తాజాగా ఓ ఆన్‌లైన్‌ షాపింగ్‌ కార్యక్రమంలో కనిపించినట్లు చైనాలోని ఓ ఇంటర్నెట్‌ పోర్టల్‌ వెల్లడించింది. కానీ, ఝావోపై అధికారిక సమాచారం మాత్రం ఇప్పటికీ తెలియదు.

మెంగ్‌ హాంగ్వే : ఇంటర్‌పోల్‌ చీఫ్‌

చైనాకు చెందిన మెంగ్‌ హాంగ్వే 2016లో ప్రపంచ వ్యాప్తంగా పోలీసులకు సహకారం అందించే ‘ఇంటర్‌పోల్‌’ విభాగానికి చీఫ్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు చైనాలో ప్రజాభద్రతా విభాగానికి ఇంఛార్జిగా ఉన్న మెంగ్‌ హాంగ్వే.. 2018లో అదృశ్యం కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చైనాకు బయలుదేరినట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత ఆయన ఆచూకీ లేకుండా పోయింది. దీనిపై ఆయన భార్య గ్రేస్‌ మెంగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫ్రాన్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలా మిస్టరీగా మారిన హాంగ్వేను ఓ కేసులో ప్రశ్నించడం కోసం చైనాకు తీసుకెళ్లినట్లుగా ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. లంచాలు స్వీకరిస్తున్నారనే ఆరోపణలపై 2020లో మెంగ్‌ను అరెస్టు చేసినట్లు చైనా ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ కేసులో ఆయనకు 13ఏళ్ల శిక్షపడినట్లు పేర్కొంది. దీంతో కిడ్నాపర్ల నుంచి ముప్పు పొంచివుందన్న ఆందోళన నేపథ్యంలో ఆయన భార్య గ్రేస్‌తో పాటు ఇద్దరు పిల్లలకు ఫ్రాన్స్‌ ఆశ్రయం కల్పించింది. ఈ మధ్యే తొలిసారి మీడియా ముందుకు వచ్చిన గ్రేస్‌ మెంగ్‌.. తన భర్త ఆచూకీ ఇప్పటికీ లభించలేదని వాపోయారు.

జాక్‌ మా : వ్యాపారవేత్త

చైనాలో శక్తివంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన అలీబాబా గ్రూప్‌ సంస్థ అధినేత జాక్‌మా పైనా చైనా ప్రభుత్వం కన్నేసింది. గతేడాది అక్టోబరులో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్‌ మా ప్రసంగిస్తూ.. చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. దీనిపై మండిపడ్డ చైనా ప్రభుత్వం.. ఆయనపై ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. ఆయనకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌ ఐపీఓను అడ్డుకోవడంతోపాటు గుత్తాధిపత్య పద్ధతులను అమలు చేస్తోందనే ఆరోపణలపై ఆ సంస్థపై విచారణకు ఆదేశించింది. దీంతో జాక్‌మా ఆస్తుల విలువ ఒక్కసారిగా పడిపోయాయి. అదే సమయంలో జాక్‌ మా దాదాపు మూడు నెలల పాటు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన ఎక్కడున్నారన్నది మిస్టరీగా మారింది. ఒకనొక సమయంలో జాక్‌ మా చైనాను విడిచి వెళ్లిపోయారనే ఊహాగానాలు వినిపించాయి. చివరకు ఆయన ఇంటినుంచి ఓ వీడియో కాల్‌లో ప్రత్యక్షమయ్యారు.

గువై మిన్‌హాయ్‌ : ప్రచురణకర్త

చైనా రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూ హాంకాంగ్‌ వేదికగా ప్రచురణలు చేసే గువై మిన్‌హాయ్‌.. 2015లో అదృశ్యమయ్యారు. కొన్ని నెలలపాటు ఆయన ఆచూకీ ఎవ్వరికీ తెలియలేదు. మరుసటి ఏడాది చైనా అధికారిక మీడియాలో ప్రత్యక్షమైన గువై.. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో అరెస్టయినట్లు వెల్లడించారు. రెండేళ్ల తర్వాత కొన్ని ఆంక్షల నడుమ తాత్కాలికంగా విడుదల చేయడంతో పాటు వీడియో కాల్‌ చేసుకునేందుకు ఆయనకు చైనా అధికారులు అనుమతించారు. అదే సమయంలో ఓసారి మరో ఇద్దరు స్వీడన్‌ దౌత్యవేత్తలతో కలిసి ప్రయాణిస్తోన్న గువైని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో చైనా తీరుపై స్వీడన్‌తో పాటు యూరప్‌ దేశాలు మండిపడ్డాయి. ఇలా గువైని నిర్బంధించడం యూరప్‌ - చైనా దౌత్య సంబంధాలపై కూడా తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది.

పెంగ్‌ షువాయి : టెన్నిస్‌ క్రీడాకారిణి

చైనా ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్‌పై అక్కడి టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి లైంగిక ఆరోపణలు చేశారు. మరుసటి రోజు (నవంబర్ 2వ తేదీ) నుంచి పెంగ్‌ షువాయి కనిపించకుండా పోయారు. దీంతో ఆమె ఆచూకీపై ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్‌ క్రీడాకారుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సెరెనా విలియమ్స్‌, మహిళల టెన్సిస్‌ సంఘం (WTA) కూడా పెంగ్‌ అదృశ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చణీయాంశం కావడంతో చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ స్పందించింది. పెంగ్‌ షువాయి ప్రస్తుతం ఆమె నివాసంలోనే ఉన్నారని.. త్వరలోనే పౌర సమాజం ముందుకు వస్తారని పేర్కొంది. అయినప్పటికీ చైనా ప్రభుత్వ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కేవలం వీరే కాకుండా గడిచిన దశాబ్ది కాలంలో ఎంతో మంది ప్రముఖులపై చైనా ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. కొవిడ్‌ విజృంభించిన సమయంలోనూ వుహాన్‌లో జర్నలిస్టు అదృశ్యమైన వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించేవారి, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులతో పాటు ఇతర సినీ ప్రముఖుల జాడ లేకుండా చేస్తోందని విమర్శలు ఎక్కువయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని