
China Stock Exchange: చైనాలో కొత్తగా మరో స్టాక్ ఎక్ఛేంజీ!
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రకటన
బీజింగ్: చైనాలో కొత్తగా మరో స్టాక్ ఎక్ఛేంజీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ వెల్లడించారు. దేశీయ సంస్థలు విదేశాలకు బదులుగా స్థానికంగానే నమోదు చేసుకునేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అక్కడ రెండు స్టాక్ ఎక్ఛేంజీలు (షాంఘై, షెన్జెన్) ఉండగా.. కొత్తగా దీనిని బీజింగ్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
చిన్న, మధ్యతరహా కంపెనీలకు ఊతమివ్వడంలో భాగంగా ఈ నూతన స్టాక్ ఎక్ఛేంజీని ఏర్పాటు చేయబోతున్నట్లు బీజింగ్లో ఏర్పాటు చేసిన ఓ ట్రేడ్ ఫెయిర్లో అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రకటించారు. అయితే, వాటికి ఎలాంటి సహకారం ఉంటుందనే విషయాలు మాత్రం అధ్యక్షుడు వెల్లడించలేదు.
మరోవైపు గతకొన్ని రోజులుగా టెక్ కంపెనీలతో పాటు పలు కంపెనీలపై చైనా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. చిన్నారులు వారంలో కేవలం కొన్ని గంటలపాటే వీడియో గేమ్లు ఆడుకునేలా ఈ మధ్యే ఆంక్షలు విధించారు. అంతేకాకుండా టీవీల్లో టాలెంట్ పోటీలను కూడా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు పలు కీలక రంగాల్లో చైనా అధికారులు నిబంధనలు కఠినతరం చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు నూతన స్టాక్ ఎక్ఛేంజీ ప్రకటన చేయడం గమనార్హం.
ఇవీ చదవండి
Advertisement