Civils 2020 Toppers Score: సివిల్స్‌ టాపర్‌ సాధించిన స్కోర్‌ ఎంతో తెలుసా..?

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష - 2020 ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన శుభమ్‌ కుమార్‌ మొత్తంగా 52.04 శాతం మార్కులు సాధించినట్లు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వెల్లడించింది.

Published : 30 Sep 2021 01:26 IST

వివరాలు వెల్లడించిన యూపీఎస్‌సీ

దిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2020 ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. ఇందులో టాపర్‌గా శుభమ్‌ కుమార్‌ నిలవగా.. జగ్రతి అవాస్థి రెండో ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఆ పరీక్షల్లో శుభమ్‌ మొత్తంగా 52.04 శాతం మార్కులు సాధించినట్లు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వెల్లడించింది. రెండో ర్యాంకు సాధించిన జగ్రతి 51.95 శాతం మార్కులు పొందినట్లు తెలిపింది. సివిల్స్‌కు ఎంపికైన వారు సాధించిన మార్కుల వివరాలను యూపీఎస్‌సీ అందుబాటులో ఉంచింది.

సివిల్స్‌ పరీక్షలో మొత్తం 2025 మార్కులు ఉండగా.. 1750 మార్కులు మెయిన్ పరీక్షకు, మరో 275 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయిస్తారు. వీటిలో ఈసారి సివిల్స్‌ టాపర్‌గా నిలిచిన శుభమ్‌ కుమార్‌ మొత్తం 1054 మార్కులు సాధించారు. రాత పరీక్షలో 878 మార్కులు పొందగా.. ఇంటర్వ్యూలో 176 మార్కులు సాధించినట్లు యూపీఎస్‌సీ వెల్లడించింది. తొలి ఐదు ర్యాంకులు సాధించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

తొలి ర్యాంకు - శుభమ్‌ కుమార్‌ - 1054 మార్కులు (రాతపరీక్షలో 878, ఇంటర్వ్యూలో 176)

రెండో ర్యాంకు - జాగ్రతి అవాస్థి - 1052 మార్కులు (రాతపరీక్షలో 859, ఇంటర్వ్యూలో 193)

మూడో ర్యాంకు - అంకితా జైన్‌ - 1051 మార్కులు (రాతపరీక్షలో 839, ఇంటర్వ్యూలో 212)

నాలుగో ర్యాంకు - యాష్‌ జాలుకా 1046 మార్కులు (రాతపరీక్షలో 851, ఇంటర్వ్యూలో 195)

ఐదో ర్యాంకు - మమతా యాదవ్‌ 1042 మార్కులు (రాతపరీక్షలో 855, ఇంటర్వ్యూలో 187) సాధించారు.

అఖిల భారత సర్వీసుల కోసం నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2020 ఫలితాల్లో మొత్తం 761 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్‌, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 61 మంది ఎస్టీతో పాటు 86 మంది ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ పరీక్ష మూడు విభాగాల్లో (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ) జరుగుతుంది. ప్రిలిమ్స్‌లో మొత్తం 400 మార్కులు ఉండగా.. కేవలం వీటిని స్ర్కీనింగ్‌ టెస్టుగానే పరిగణిస్తారు. వీటిలో సాధించిన మార్కులు మెరిట్‌ జాబితాలో పరిగణించరు. కేవలం మెయిన్‌, ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ ఆధారంగానే యూపీఎస్‌సీ మెరిట్‌ జాబితాను రూపొందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని