Coal Crisis: అందువల్లే దేశంలో బొగ్గు సంక్షోభం..!

దేశవ్యాప్తంగా కొన్ని బొగ్గు గనులు మూతపడడం, భారీ వర్షాల కారణంగా మరికొన్ని గనులను వరదలు ముంచెత్తడం వల్లే బొగ్గు సంక్షోభం ఏర్పడిందని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొన్నారు.

Published : 14 Oct 2021 18:37 IST

కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి

రాంచీ: దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ బొగ్గు సంక్షోభంపై ప్రధాని కార్యాలయంతోపాటు కేంద్ర మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే, దేశవ్యాప్తంగా కొన్ని బొగ్గు గనులు మూతపడడం, భారీ వర్షాల కారణంగా మరికొన్ని గనులను వరదలు ముంచెత్తడం బొగ్గు సంక్షోభానికి కారణమయ్యాయని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొన్నారు. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం పరిస్థితులు మెరుగు పడుతున్నాయని వెల్లడించారు.

ఝార్ఖండ్‌లోని ఛాత్రా జిల్లాలోని సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌ (CCL)కు చెందిన అశోకా బొగ్గు గనిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు అవసరమైన బొగ్గు సరఫరా సజావుగానే సాగుతోందని స్పష్టం చేశారు. సరఫరాలో కాస్త ఆటంకం ఏర్పడుతున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా నిత్యం 20లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని.. వీటిని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం వర్షాల వల్లనే పలు బొగ్గు గనులను వరదలు ముంచెత్తడంతోనే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరాకు అవరోధం ఏర్పడుతోందని తెలిపారు.

ఇక దేశంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కోవడంతో పాటు ఇప్పటికే పలు కేంద్రాలు మూతపడినట్లు ఆయా రాష్ట్రాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధానితో పాటు ఆరు రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను బొగ్గు కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో కరెంటు కోతలు తప్పడం లేదంటూ ఆయా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ కేంద్రాలకు అవసరమైన బొగ్గు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు కరెంటు సంక్షోభాన్ని తోసిపుచ్చుతోన్న కేంద్రం.. దేశంలో బొగ్గు కొరత లేదని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 22 రోజులకు సరిపోయే బొగ్గు నిల్వలు ప్రస్తుతం కోల్‌ ఇండియా దగ్గర అందుబాటులో ఉన్నట్లు చెబుతోంది. రుతుపవనాల ప్రభావం తగ్గుతున్నందున రానున్న రోజుల్లో బొగ్గు లభ్యత మరింత పెరుగుతుందని పేర్కొంటోంది. అంతేకాకుండా దేశంలో మరో 30 నుంచి 40ఏళ్ల పాటు బొగ్గుకు డోకా లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని