
Petrol Price: వ్యాట్ను తగ్గించిన దిల్లీ.. లీటరుపై రూ.8 తగ్గిన పెట్రోల్!
ఆమ్ఆద్మీ ప్రభుత్వం నిర్ణయం
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్పై ప్రస్తుతం 30శాతంగా ఉన్న వ్యాట్ను 19.40శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్ ధర ఒక్కసారిగా రూ.8 తగ్గనుంది. తగ్గిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.103.97గా ఉండగా.. డీజిల్ ధర రూ.86.67గా ఉంది. తాజాగా రూ.8 తగ్గడంతో లీటరు పెట్రోల్ రూ.95కే లభించనుంది. అయితే, గతేడాది జులైలో పెట్రోల్పై వ్యాట్ను 30శాతానికి, డీజిల్పై 16.75శాతానికి దిల్లీ ప్రభుత్వం పెంచింది. అనంతరం ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. తాజాగా వీటిని సమీక్షించిన ప్రభుత్వం.. పెట్రోల్పై వ్యాట్ను 19శాతానికి తగ్గించింది.
ఇప్పటికే నవంబర్ 4న ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అదే బాటలో పయనించిన పలు రాష్ట్రాలు వ్యాట్ను కూడా తగ్గించాయి. దీంతో ఇంధన ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాట్ను తగ్గించినప్పటికీ.. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు మాత్రం ఎటువంటి తగ్గింపు నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు వందకుపైగానే ఉన్నాయి. తాజాగా వ్యాట్ను తగ్గిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వ ప్రకటించింది.
ఇదిలాఉంటే, క్రితం నెలలో ఇంధన ధరలు దాదాపు 23సార్లు పెరిగి రికార్డు స్థాయికి దూసుకెళ్లాయి. గడిచిన 27 రోజులుగా మాత్రం ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించకపోవడంతో పెట్రోల్ ధరలు 110కి చేరువలోనే ఉండిపోయాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.108 ఉండగా.. డీజిల్ ధర 94గా ఉంది. ఏపీలోనూ దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. ముంబయిలో పెట్రోల్ లీటరు రూ.109.98కు విక్రయిస్తుండగా.. డీజిల్ మాత్రం 94.14గా ఉంది.
ఇవీ చదవండి
Advertisement