India@UNSC: ఐరాస భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో భారత్!
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. ఆగస్టు నెల మొత్తం భారత్ ఈ పదవిలో కొనసాగనుంది.
ఆగస్టు నెల విధులు నిర్వర్తించనున్న భారత్
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. ఆగస్టు నెల మొత్తం భారత్ ఈ పదవిలో కొనసాగనుంది. అంతకుముందు నెల(జులై)లో ఈ పదవిలో ఉన్న ఫ్రాన్స్ ప్రతినిధి నుంచి భారత రాయబారి బాధ్యతలు స్వీకరించారు. భద్రతా మండలిలో రెండేళ్ల పాటు (2021-2022) తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతోన్న భారత్, అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఆగస్టు నెలతో పాటు తాత్కాలిక సభ్య దేశంగా గడువు ముగిసే (డిసెంబర్ 2022) చివరి నెలలోనూ మరోసారి అధ్యక్ష పదవిని భారత్ చేపట్టనుంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి ఈ బాధ్యతల్లో కొనసాగుతారు.
ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పీఠాన్ని చేపట్టిన భారత్, కీలక అంశాలపై దృష్టిపెట్టనుంది. ముఖ్యంగా శాంతి స్థాపన, ఉగ్రవాదంపై పోరు, సముద్ర తీర భద్రత అంశాలను అజెండాగా పేర్కొంది. ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వర్తిస్తామని ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ ఎప్పుడూ ముందుంటుందని.. ఇకపై కూడా ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. భారత్ ఈ పదవి చేపట్టడానికి కృషిచేసిన ఫ్రాన్స్కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారత్ చేపట్టడం పట్ల ఫ్రాన్స్, రష్యా దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. విధుల నిర్వహణలో భారత్కు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించాయి. భారత్ అజెండాలోని మూడు అంశాలపై కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఫ్రాన్స్ పేర్కొంది. ఫ్రాన్స్ తర్వాత భారత్ ఈ పదవి చేపట్టడం సంతోషంగా ఉందని.. అంతేకాకుండా ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లోనూ భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనెన్ పేర్కొన్నారు. అటు భారత్ అజెండా స్ఫూర్తిదాయకంగా ఉందని రష్యా కూడా అభిప్రాయపడింది.
ఇక ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టిన నేపథ్యంలో.. ఇతర సభ్యదేశాలతోనూ కలిసి ముందుకు సాగుతామని భారత విదేశాంగమంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ సంయమనంతో సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!