
India Corona: ఏడు వేలకు దిగొచ్చిన కేసులు..
543 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు
దిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 543 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. గత కొద్దికాలంగా వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో.. కొత్త కేసుల్లో భారీ తగ్గుదల నమోదవుతోంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
సోమవారం 9,64,980 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 7,579 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. గత ఏడాది మే నాటి స్థాయికి ఇవి పడిపోయాయి. నిన్న కేరళలో 3,698 మందికి కరోనా సోకింది. 180 మంది మరణించారు. దేశవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 236గా ఉంది. ఇక ఇప్పటివరకు 3.45 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా..4,66,147 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
క్రియాశీల కేసులు తగ్గుతూ, రికవరీల సంఖ్య మెరుగవుతుండటం ఊరటనిస్తోంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,13,584 గా ఉంది. బాధితుల సంఖ్య 536 రోజుల కనిష్ఠానికి చేరింది. నిన్న 12,202 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.39 కోట్లకు చేరాయి. క్రియాశీల రేటు 0.33 శాతానికి పడిపోగా.. రికవరీ రేటు 98.32 శాతానికి పెరిగింది. ఇక నిన్న 71,92,154 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 117 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.